మహీంద్రా ఎక్స్‌యూవీ500 కొత్త వేరియంట్

26 May, 2015 01:33 IST|Sakshi
మహీంద్రా ఎక్స్‌యూవీ500 కొత్త వేరియంట్

ధరలు రూ.11.21 లక్షల నుంచి రూ.15.99 లక్షల రేంజ్‌లో
* రెండు కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలు

న్యూఢిల్లీ: మహీంద్రా కంపెనీ ఎక్స్‌యూవీ500 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్, ఆరు విధాలుగా అడ్జెస్ట్ చేసుకునే సీట్లు, తదితర ప్రత్యేకతలున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు.

ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లోని ఎంట్రీ లెవెల్ వేరియంట్ డబ్ల్యూ4 ధర రూ.11.21 లక్షలని, హై ఎండ్ వేరియంట్ డబ్ల్యూ10 ధర రూ.15.99 లక్షలని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు. ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్లో తమ మార్కెట్ 40 శాతమని, దీనిని మరింతగా పెంచుకోవడానికి ఈ కొత్త వేరియంట్ ఉపకరిస్తుందని వివరించారు.
 
తొమ్మిది కొత్త మోడళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది మోడళ్లను మార్కెట్లోకి తేనున్నామని పవన్ గోయెంకా చెప్పారు. వీటిల్లో 2 కొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ ఉన్నాయని,  వీటితో పాటు ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త వేరియంట్లను అందిస్తామని వివరించారు. ఇక కొత్తగా తేనున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలను తక్కువ ధరల్లోనే అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అందిస్తున్న క్వాంటో మోడల్ ధర(రూ.6.65 లక్షలు-8.17 లక్షలు) కంటే తక్కువకే ఈ కొత్త ఎస్‌యూవీలను అందిస్తామన్నారు. ఈ క్వార్టర్‌లోనే వెరిటో ఎలక్ట్రిక్ వేరియంట్‌ను అందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు