ఐఆర్‌సీటీసీ యూజర్‌ ఐడీ క్రియేట్‌ చేస్తున్నారా?

13 Nov, 2018 15:59 IST|Sakshi

రైల్వే టికెట్‌ ఏజెంట్ల అక్రమ దందాకు చెక్‌

ఐఆర్‌సీటీసీ యూజర్‌ నిబంధనలు పటిష్టం

యూజర్‌ ఐడీ క్రియేషన్‌ ఇకపై మరింత  కఠినం

సాక్షి న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్‌ బుకింగ్‌ విషయంలో వినియోగదారులకు ఊరట. రైల్వే టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐర్‌సీటిసి) త్వరలోనే చర్యలు చేపట్టనుంది.  ముఖ్యంగా  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కస్టమర్లు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి నిబంధనలను మరింత కఠినం చేయనుంది.  దీనికి సంబంధించిన నిర్ణయాలను ప్రకటించనుంది.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఏజెంట్‌గా పొందిన గుర్తింపుపై కాకుండా బినామీ పేర్లతో నకిలీ ఐడీలనుసృష్టించి, తద్వారా తత్కాల్‌ సహా, ఆన్‌లైన్‌లో టికెట్‌ విక్రయాల్లో అక్రమ దందాకు చెక్‌ చేపట్టేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఆర్‌సీటీసీలో​ యూజర్‌ ఐడీ క్రియేట్‌ చేసుకునేందుకు ఉద్దేశించిన నిబంధలను పటిష్టం చేయనుంది. వెబ్‌సైట్‌లో యూజర్ల  నమోదుకు  మరిన్ని గుర్తింపులను కోరనుంది. ఐఆర్‌సీటీసీ వినియోగదారుని ఐడి,పాస్‌వర్డ్, మొబైల్ నంబర్‌తోపాటు ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు వంటి ఇతర ముఖ్యమైన ఐడీలను కూడా వినియోగదారుని కోరనుంది.

బినామీ పేర్లతో నకిలీ ఐడీలతో ఏజెంట్లు పెద్ద ఎత్తున అక్రమ దందాకు పాల్పడుతున్న వైనం తెలిసిందే. వేలాది నకిలీ యూజర్ ఐడిల ద్వారా ఇ-టికెట్లను బ్లాక్‌ చేసి, వాటిని అధిక ధరకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలను దండుకుంటున్న ఏజెంట్ల ఆటకట్టించేందుకు  అధికారులు దృష్టి సారించారు.

మరిన్ని వార్తలు