దలాల్‌ స్ట్రీట్‌కు సీతారామన్‌ దన్ను

20 Sep, 2019 17:26 IST|Sakshi

సాక్షి, ముంబై : దలాల్‌ స్ట్రీట్‌ చరిత్రలో సెప్టెంబరు 20, 2019 మైలురాయిలా నిలిచిపోతుంది. గత దశాబ్ద కాలంలోలేని విధంగా దూసుకుపోయిన వైనం, ఒక రోజులో అతి భారీ లాభాలు లాంటి  రికార్డులు  ఇవాల్టి మార్కెట్లో నమోదయ్యాయి.  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో సెన్సెక్స్‌  ఒక దశలో 2200 పాయింట్ల పైగా ఎగియగా, నిఫ్టీ 650 పాయింట్లకు పైన లాభపడింది. దీంతో కీలక సూచీలు కీలక మద్దతు స్థాయిలకు ఎగువకు చేరాయి, ఆఖరి  అర్ధగంటలో లాభాల స్వీకరణతో  చివరికి సెన్సెక్స్‌ 1921 పాయింట్ల లాభంతో  38,014 వద్ద, నిఫ్టీ సైతం 569 పాయింట్లు జంప్‌చేసి 11,274 వద్ద స్థిరపడింది. బ్యాంకు నిఫ్టీ కూడా 7 శాతం రికార్డు లాభాలను సాధించింది.  దాదాపు అన్ని రంగాలు లాభాల దూకుడు ప్రదర్శించాయి. 

ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, క్యాపిట్‌, కన్సూమర్‌ గూడ్స్‌ రంగాలు 10-6 శాతం దూసుకెళ్లాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, హీరో మోటో, ఇండస్‌ఇండ్, బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతీ, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌, బ్రిటానియా, టైటన్‌, ఎంఅండ్‌ఎం టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌ప్రైజెస్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా స్వల్పంగా నష్టపోయాయి. దీంతో చరిత్రలో తొలిసారి లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కేపిట లైజేషన్‌   రూ. 7 లక్షల కోట్లకు చేరింది.  వెరసి మార్కెట్‌ విలువ రూ. 1.45 ట్రిలియన్లను  అధిగమించడం విశేషం.

>
మరిన్ని వార్తలు