లాభాల స్వీకరణతో మిశ్రమంగా సూచీలు
7 పాయింట్ల లాభంతో 39,097కు సెన్సెక్స్
12 పాయింట్లు పతనమై 11,588కు నిఫ్టీ
రెండు రోజుల వరుస రికార్డ్ లాభాల నేపథ్యంలో మంగళవారం లాభాల స్వీకరణ చోటు చేసుకొని స్టాక్ మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. అనూహ్యంగా కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించడంతో శుక్ర, సోమవారాల్లో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 8 శాతం మేర లాభపడిన విషయం తెలిసిందే. ఈ భారీ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. సెన్సెక్స్ 39,000 పాయింట్లపైన ముగిసినప్పటికీ, నిఫ్టీ మాత్రం 11,600 దిగువకే పడిపోయింది. ఇంట్రాడేలో 393 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 7 పాయింట్ల స్వల్ప లాభంతో 39,097 పాయింట్ల వద్ద ముగిసింది. ఇన ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్లు తగ్గి 11,588 పాయింట్ల వద్దకు చేరింది. అంతకు ముందటి రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,997, నిఫ్టీ 895 పాయింట్ల మేర పెరిగిన విషయం తెలిసిందే.
393 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్..
ఇటీవల లాభపడిన బ్యాంక్, లోహ షేర్లలో లాభాల స్వీకరణ జరిగి అవి నష్టాల్లో ముగిశాయి. గత మూడు రోజులుగా నష్టపోతూ వచ్చిన ఐటీ షేర్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. పరిమితి శ్రేణిలో లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. ఒక దశలో 216 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 177 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 393 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3.2 శాతం లాభంతో రూ.1,279 వద్ద ముగిసింది.