హెచ్చుతగ్గుల మధ్య లాభాల్లోకి మార్కెట్లు

23 Jul, 2020 09:34 IST|Sakshi

75 పాయింట్లు ప్లస్‌

37,946కు సెన్సెక్స్‌

26 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ

ఐటీ మాత్రమే వెనకడుగులో

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 75 పాయింట్లు పుంజుకుని 37,946కు చేరగా.. నిఫ్టీ 26 పాయింట్లు బలపడి 11,158 వద్ద ట్రేడవుతోంది. ప్రభుత్వ ప్యాకేజీపై ఆశలతో బుధవారం యూఎస్‌ మార్కెట్లు లాభపడగా.. యూఎస్‌, చైనా మధ్య తాజా వివాదాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. 37,815 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 37,739 దిగువన కనిష్టాన్ని తాకగా..  37,995 వద్ద గరిష్టానికీ చేరింది.

మీడియా జోరు
ఎన్‌ఎస్‌ఈలో మీడియా 2 శాతం పుంజుకోగా.. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, రియల్టీ, ఫార్మా  0.5 శాతం స్థాయిలో లాభపడ్డాయి. ఐటీ ఇదే స్థాయిలో వెనకడుగు వేసింది. నిఫ్టీ దిగ్గజాలలో జీ, యూపీఎల్‌, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిటానియా, గెయిల్‌, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే యాక్సిస్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఆటో 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి.

గ్లెన్‌మార్క్‌ అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో గ్లెన్‌మార్క్‌, పీవీఆర్‌, సెంచురీ టెక్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్, హెచ్‌పీసీఎల్‌, మణప్పురం 3-2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా మరోపక్క అదానీ ఎంటర్‌, ఎస్కార్ట్స్‌, జీఎంఆర్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, బయోకాన్‌, నౌకరీ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో 1026 షేర్లు లాభపడగా.. 500 నష్టాలతో ట్రేడవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు