అధిక ఆదాయవర్గాలపై అదనపు సర్చార్జీలు తదితర అంశాలతో ఆందోళన చెందుతున్న మార్కెట్ వర్గాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. అదనపు సర్చార్జీ నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్పీఐ) మినహాయింపునివ్వాలని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) సమీక్షించాలని, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)ని పూర్తిగా ఎత్తివేయడం లేదా కనీసం తగ్గించడమైనా చేయాలని కోరుతూ డిమాండ్ల చిట్టాను మంత్రికి అందజేశారు. గోల్డ్మన్ శాక్స్, నొమురా, బ్లాక్రాక్, సీఎల్ఎస్ఏ, బార్క్లేస్, జేపీ మోర్గాన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎఫ్పీఐల అభిప్రాయాలను మంత్రి సావధానంగా విన్నారని.. అయితే ఎటువంటి హామీ మాత్రం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
రూ. 2 కోట్ల పైగా ఆదాయం ఉన్న వారికి వర్తించే పన్నులతో పాటు అదనపు సర్చార్జీ కూడా విధించాలని బడ్జెట్లో చేసిన ప్రతిపాదనతో ఆందోళన చెందుతున్న ఎఫ్పీఐలు స్టాక్మార్కెట్లలో భారీగా విక్రయాలు జరపడం, మార్కెట్లు భారీగా పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రితో ఎఫ్పీఐల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నిధుల అవసరాల కోసం ఎన్బీఎఫ్సీలు కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా ఇతరత్రా సాధనాలూ పరిశీలించాలని, అలాగే ఈ రంగానికి కూడా నేషనల్ హౌసింగ్ బోర్డు (ఎన్హెచ్బీ) తరహాలో ప్రత్యేక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉందని ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ రామన్ అగర్వాల్ చెప్పారు.