మారుతీ, టయోటా సుషో జాయింట్‌ వెంచర్‌

7 Nov, 2019 12:20 IST|Sakshi

వాహన విచ్ఛిన్నం, పునర్వినియోగ కేంద్రాల ఏర్పాటు కోసం జట్టు

న్యూఢిల్లీ: దేశంలో వాహన విచ్ఛిన్నం, రీసైక్లింగ్‌ యూనిట్ల ఏర్పాటు నిమిత్తం నూతన జాయింట్‌ వెంచర్‌ (జేవీ)ను నెలకొల్పినట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ), టయోటా సుషో సంస్థలు బుధవారం ప్రకటించాయి. మారుతీ సుజుకీ టయోసు ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎంఎస్‌టీఐ) పేరిట ఏర్పాటు చేసిన ఈ జేవీలో ఎంఎస్‌ఐకు 50 శాతం వాటా, టయోటా సుషో గ్రూప్‌ కంపెనీలకు మిగిలిన 50 శాతం వాటా ఉన్నట్లు వెల్లడించాయి. కాలం చెల్లిన వాహనాలను సేకరించి వాటిని విచ్ఛిన్నం చేయడం ఎంఎస్‌టీఐ బాధ్యత కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన నాణ్యత, పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణను కొత్త జేవీ చేపడుతుంది. 2020–21 నాటికి నోయిడా, ఉత్తర ప్రదేశ్‌ల్లో యూనిట్లను ఏర్పాటు చేయనున్నామని, నూతన జేవీతో వనరుల పూర్తిస్థాయి వినియోగం జరగనుందని ఎంఎస్‌ఐ ఎండీ, సీఈఓ కెనిచి ఆయుకవా అన్నారు. నోయిడా ప్లాంట్‌ సామర్థ్యం నెలకు 2,000 వాహనాలుగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు