దివాళి ఆఫర్‌ : కార్లపై భారీ డిస్కౌంట్లు

17 Oct, 2017 08:43 IST|Sakshi

పండుగకి కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరియైన సమయమట. కార్ల తయారీ సంస్థలు వినియోగదారులను ఊరించే డిస్కౌంట్లను దివాళి కానుకగా మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ డిస్కౌంట్లకు తెరతీశాయి. కారు ధరపై రూ.20వేల నుంచి రూ.1.3 లక్షల వరకు డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. అంతేకాక క్యాష్‌బ్యాక్‌, ఉచితంగా యాక్ససరీస్‌, ఉచితంగా ఇన్సూరెన్స్‌, రిజిస్ట్రేషన్‌, గోల్డ్‌ కాయిన్లు, తక్కువ వడ్డీ స్కీమ్‌లు వంటి పలు స్కీమ్‌లను కార్ల తయారీ సంస్థలు ప్రవేశపెట్టేశాయి. ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ కింద మారుతీ సుజుకీ స్విఫ్ట్‌, సెలెరియో కొనుగోలు చేయాలనుకునే వారికి రూ.40వేల లబ్ది చేకూరనుంది. దేశంలోనే అత్యధిక మొత్తంలో అమ్ముడుపోతున్న కారు మోడల్‌ ఆల్టోపై కూడా మారుతీ సుజుకీ రూ.40వేల వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది. కానీ టాప్‌ సెల్లింగ్‌ మోడల్స్‌ డిజైర్‌, బాలెనో, బ్రిజా వాటిపై మాత్రం డిస్కౌంట్లను అందుబాటులోకి తేలేదు. 

దేశంలో రెండో అతిపెద్ద కారు తయారీదారిగా పేరున్న హ్యుందాయ్‌ కూడా తన పెట్రోల్‌ గ్రాండ్‌ ఐ10పై రూ.80వేల వరకు, డీజిల్‌ మోడల్‌పై రూ.90వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. గ్రాండ్‌ ఐ10 హ్యాందాయ్‌కి భారత్‌లో టాప్‌ సెల్లింగ్‌ మోడల్‌. రెండు నెలల క్రితం లాంచ్‌ చేసిన కొత్త ఎక్స్‌సెంట్‌పై కూడా రూ.50వేల వరకు డిస్కౌంట్‌ను హ్యాందాయ్‌ ప్రకటించింది. ఎస్‌యూవీ స్పెషలిస్టు మహింద్రా అండ్‌ మహింద్రా తన ఎక్స్‌యూవీ500పై రూ.50వేలు, టీయూవీ300పై రూ.45వేలు, స్కార్పియోపై రూ.42,500 డిస్కౌంట్లను అందిస్తోంది. నిస్సాన్‌ టెర్రానో, ఫోక్స్‌వాగన్‌ వెంటోలపై భారీ మొత్తంలో రూ.1.37 లక్షల, రూ.1.3 లక్షల డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హోండా తన బీర్‌వీపై లక్ష రూపాయలు, మారుతీ ఎర్టిగాపై లక్ష రూపాయల ప్రయోజనాలను అందిస్తోంది. లగ్జరీ కారు తయారీదారు మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి, బీఎండబ్ల్యూ, వోల్వో, జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలు కూడా రూ.6 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు