వాహన అమ్మకాలకు పెట్రో సెగ!

2 Oct, 2018 00:36 IST|Sakshi

సెప్టెంబర్‌లో నెమ్మదించిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

హోండా కార్స్‌ 19% క్షీణత...

16% తగ్గిన మహీంద్రా అమ్మకాలు

పండుగల సీజన్‌పై ఆశాభావం..!

న్యూఢిల్లీ: వాహన విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబరులో నెమ్మదించాయి. పలు దిగ్గజ ఆటో కంపెనీల ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు క్షీణతను నమోదుచేయగా.. మరికొన్ని కంపెనీల విక్రయాలు కేవలం ఒక్క అంకె వృద్ధి రేటుకే పరిమితమైపోయాయి. ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు   పెరుగుదల  విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపాయి.

ఇదే సమయంలో పలు చోట్ల లోటు వర్షపాతం నమోదుకావడం, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు ఉండడం వల్ల అమ్మకాలు అంతంత మాత్రంగానే కొనసాగాయని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ డిప్యూటీ ఎండీ ఎన్‌ రాజా వ్యాఖ్యానించారు. ‘సెప్టెంబరు విక్రయాలు స్తబ్ధుగా ఉన్నాయి. క్రూడ్‌ ధరలు పెరగడం, వర్షపాతం తగ్గడం వంటి ప్రతికూల అంశాలతో వినియోగదారులు వెనక్కు తగ్గారు.’ అని ఎం అండ్‌ ఎం ప్రెసిడెంట్‌ రాజన్‌ వాడెరా అన్నారు. అయితే రానున్నది పండుగ సీజన్‌ కావడం వల్ల అమ్మకాలు ఊపందుకోనున్నాయని భావిస్తున్నట్లు ఫోర్డ్‌ ఇండియా ఎండీ అనురాగ్‌ మెహ్రోత్రా తెలిపారు.

మరిన్ని వార్తలు