మారుతీ లాభం 28 శాతం డౌన్‌

14 May, 2020 03:58 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 28 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.1,831 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.1,322 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ తెలిపింది. అమ్మకాలు తగ్గడం, ప్రమోషన్‌ వ్యయాలు పెరగడం, తరుగుదల వ్యయాలు కూడా అధికం కావడంతో నికర లాభం తగ్గిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.21,473 కోట్ల నుంచి 15 శాతం క్షీణించి రూ.18,208 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 60 డివిడెండ్‌ను ప్రకటించింది.

► గత క్యూ4లో మొత్తం కార్ల అమ్మకాలు 16 శాతం తగ్గి 3.85 లక్షలకు చేరాయి.
► పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో రూ.7,651 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 26 శాతం క్షీణించి రూ.5,678 కోట్లకు తగ్గింది.  
► నికర అమ్మకాలు రూ.86,069 కోట్ల నుంచి రూ.75,661 కోట్లకు తగ్గాయి.  
► ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో మారుతీ షేర్‌ 1.8 శాతం లాభంతో రూ.5,035కు పెరిగింది.

ఉద్యోగాలు, వేతనాల్లో కోత లేదు: గత ఏడాది నుంచి వాహన పరిశ్రమ సుదీర్ఘ సంక్షోభాన్ని ఎదుర్కొంటొందని, కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఉద్యోగాల్లో, వేతనాల్లో ఎలాంటి కోత విధించలేదని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు