అత్యుత్తమ సీఈఓల్లో మాస్టర్‌కార్డ్ బంగా

20 Oct, 2014 01:14 IST|Sakshi
అత్యుత్తమ సీఈఓల్లో మాస్టర్‌కార్డ్ బంగా

* హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రపంచ టాప్-100 జాబితాలో 64వ ర్యాంక్
* భారత్ సంతతికి చెందిన ఎకైక వ్యక్తి...

 
న్యూయార్క్: ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కంపెనీ సీఈఓల్లో మాస్టర్ కార్డ్ చీఫ్ అజయ్ బంగా చోటు దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ రివ్యూ(హెచ్‌బీఆర్) మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది టాప్-100 ప్రపంచ సీఈఓల్లో బంగా 64వ స్థానంలో నిలిచారు. అంతేకాదు.. భారత్‌లో జన్మించిన సీఈఓల్లో ఆయన ఒక్కరికి మాత్రమే ఈ జాబితాలో ర్యాంకు లభించడం విశేషం. దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలు సాధించడం, వాటాదారులకు మంచి రాబడులు, కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంపు వంటి నిర్దిష్ట అంశాలను ఇందుకు కొలమానంగా తీసుకున్నట్లు హెచ్‌బీఎస్ పేర్కొంది.

2010లో మాస్టర్‌కార్డ్ పగ్గాలను చేపట్టిన బంగా.. షేర్‌హోల్డర్లకు 169 శాతం లాభాలను అందించారని.. అదేవిధంగా కంపెనీ మార్కెట్ క్యాప్‌ను 66 బిలియన్ డాలర్ల మేర పెంచినట్లు తెలిపింది. కాగా, ర్యాం కింగ్స్‌లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సీఈఓ జెఫ్రీ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత స్థానాల్లో గిలీడ్ సెన్సైస్ సీఈఓ జాన్ మార్టిన్, సిస్కో సిస్టమ్స్ సీఈఓ జాన్ చాంబర్స్ రెండు, మూడు ర్యాంకులను చేజిక్కించుకున్నారు.
 
ఇతర ముఖ్యాంశాలివీ..
* టాప్-100లో ఇద్దరు మహిళలకే చోటుదక్కింది.  వెంటాస్ సీఈఓ డెబ్రా కఫారో(27), టీజేఎక్స్ చీఫ్ కరోల్ మేరోవిట్జ్(51) ఇందులో ఉన్నారు.
* ర్యాంకింగ్స్‌లోని కంపెనీల్లో ఇతర దేశాలకు చెందిన సీఈఓలు 13 మంది ఉండగా.. వారిలో బంగా ఒకరు.  టాప్-100 సీఈఓల్లో 29  మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్లు. 24 మందికి ఇంజినీరింగ్‌లో అండర్‌గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్నాయి.
* ఇంజినీరింగ్ విద్య వల్ల ప్రాక్టికల్(ఆచరణాత్మక) దృక్పథం అలవడుతుందని.. ఇది ఎలాంటి కెరీర్‌లోనైనా చోదోడుగా నిలుస్తుందని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోహ్రియా చెప్పారు. ముంబై ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్ చేసిన నోహ్రియా కూడా భారతీయుడే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు