సాక్షి, న్యూఢిల్లీ : భారత్మ్యాట్రిమోని బ్రాండ్ కింద ఆన్లైన్ ద్వారా పెళ్లి సంబంధాలు కుదిర్చే మ్యాట్రిమోనిడాట్కామ్ త్వరలో పబ్లిక్ ఆఫర్కు (ఐపీఓ)కు రానున్నది. సెప్టెంబర్ 11న ఇది స్ట్రీట్లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. జూలైలోనే ఈ ఐపీఓకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను కూడా ఈ సంస్థ సెబీకి సమర్పించింది. 3,767,254 ఈక్విటీ షేర్లను ఈ సంస్థ జారీచేయనుంది.
ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను ప్రకటనలకు, వ్యాపార ప్రమోషన్ కార్యకలాపాలకు, చెన్నై పరిసర ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేసి ఆఫీసు కట్టడానికి, ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాలను తిరిగి చెల్లించడానికి, జనరల్ కార్పొరేట్ అవసరాలకు వాడనుంది. ఈ ఐపీఓ ద్వారా మ్యాట్రిమోని రూ.500 కోట్ల మేర నిధులు సమీకరించనున్నదని సమాచారం. సెప్టెంబర్ 11 మొదలయ్యే ఈ ఐపీఓ ఆఫర్, సెప్టెంబర్13తో ముగుస్తుంది.
గత ఆర్థిక సంవత్సరం (2014-15) చివరి నాటికల్లా మ్యాట్రిమోనీడాట్కామ్ సంస్థ రూ.243 కోట్ల ఆదాయాన్ని, రూ.18 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. ఈ సంస్థ వద్ద 26.5 లక్షల వధూవరుల ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇంత భారీ స్థాయి లో ఐపీఓకు వస్తోన్న 2వ ఇంటర్నెట్ కంపెనీ ఇది. ఇంతకు ముందు లోకల్ సెర్చ్ ఇంజన్ జస్ట్ డయల్ 2013లో రూ.950 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించింది.