ఈ నెల18 నుంచి తొలి రీట్‌

13 Mar, 2019 00:36 IST|Sakshi

ఆఫర్‌ చేస్తున్న ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌

 ప్రైస్‌బ్యాండ్‌ రూ.299– 300 

న్యూఢిల్లీ: భారత్‌లో తొలి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌) ఈ నెల 18 నుంచి ఆరంభం కానున్నది. ఈ నెల 20న ముగిసే ఈ రీట్‌ ఆఫర్‌కు రూ.299– 300 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కంపెనీ బ్లాక్‌స్టోన్, రియల్టీ కంపెనీ ఎంబసీల జాయింట్‌ వెంచర్, ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ ఈ రీట్‌ను ఆఫర్‌ చేస్తోంది. మొత్తం 12.95 కోట్ల యూనిట్లను విక్రయించనున్నారు. ఈ రీట్‌ ద్వారా రూ.4,750 కోట్లు సమీకరించాలని ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ యోచిస్తోంది. ఇప్పటికే రూ.876 కోట్ల మేర వ్యూహాత్మక ఇన్వెస్టర్ల నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌ హామీని పొందింది. అమెరికన్‌ ఫండ్స్‌ ఇన్సూరెన్స్‌ సిరీస్, న్యూ వరల్డ్‌ ఫండ్‌ ఐఎన్‌సీ, స్మాల్‌క్యాప్‌ వరల్డ్‌ ఫండ్‌ ఇన్‌కార్పొ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సంస్థలకు 2.92 కోట్ల యూనిట్లను కేటాయించి రూ.876 కోట్లు సమీకరిస్తారు.   

రీట్‌ అంటే.... 
అద్దెలు ఆర్జించే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను నిర్వహించే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాన్ని రీట్‌గా వ్యవహరిస్తారు. ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి. రీట్స్‌కు సంబంధించిన నిబంధనలను 2014లోనే సెబీ నోటిఫై చేసింది.  

9 శాతం రాబడి...  
ఈ రీట్‌పై తొలి ఏడాది ఇంటర్నల్‌ రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌ (ఐఆర్‌ఆర్‌) 9 శాతంగా, ఐదేళ్ల కాలానికి 18 శాతం మేర ఉండొచ్చని నిపుణుల అంచనా. ఈ ప్రతిపాదిత రీట్‌లో 33 మిలియన్‌ చదరపుటడుగుల ఆఫీస్, హాస్పిటాలిటీ అసెట్స్‌ ఉన్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, నోయిడాలోని ఏడు బిజినెస్‌ పార్క్‌లు, నాలుగు సిటీ– సెంట్రిక్‌ బిల్డింగ్స్‌ భాగంగా ఉన్నాయి. దీంట్లో 24 మిలియన్‌ చదరపుటడుగుల అసెట్స్‌ ద్వారా ఏడాదికి రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. 3 మిలియన్‌ చదరపుటడుగుల రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు నిర్మాణంలో ఉండగా, మరో 6 మిలియన్‌ చదరపుటడుగుల రియల్టీ ఆస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. రానున్న మూడేళ్లలో అద్దె ఆదాయం 55 శాతం పెరగగలదన్న అంచనాలున్నాయి. ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌కు వచ్చే అద్దె ఆదాయాల్లో సగానికి పైగా ఫారŠూచ్యన్‌ 500 కంపెనీల నుంచే వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, వెల్స్‌ఫార్గో, జేపీ మోర్గాన్‌ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు