నాపై మూక దాడి చేస్తారు : మెహుల్‌ చోక్సి

24 Jul, 2018 12:49 IST|Sakshi
గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సి

ముంబై : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాల్లో నక్కిన గీతాంజలి జెమ్స్‌ ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సి, డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీలు భారత్‌కు రావడానికి ససేమిరా అంటున్నారు. పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితులుగా ఉన్న వీరు, ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా స్పష్టంగా తెలియడం లేదు. విచారణ కోసం భారత్‌ న్యాయస్థానాల ముందు హాజరు కావాలని ఎన్ని సార్లు లేఖలు పంపినా.. సరిగా స్పందించడం లేదు. తాజాగా తాను భారత్‌కు వస్తే, తనపై మూక దాడి జరుగుతుందని మెహుల్‌ చోక్సి నాటకాలు ఆడుతున్నారు. తన మాజీ ఉద్యోగులు, రుణదాతల నుంచే కాకుండా.. జైలు అధికారులు, ఖైదీల నుంచి కూడా తన ప్రాణానికి ముప్పు ఉందంటూ చోక్సి చెబుతున్నారు. 

‘ భారత్‌లో పలు మూక దాడులు జరుగుతున్నాయి. రోడ్డుపై జరుగుతున్న మూక దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయి. నాకు వ్యతిరేకంగా అనేక మంది ఆగ్రహంతో ఉన్నారు. దీంతో నేను కూడా ఈ ముప్పును ఎదుర్కొనవచ్చు’ అని స్పెషల్‌ పీఎంఎల్‌ఏ కోర్టుకు సమర్పించిన అప్లికేషన్‌లో పేర్కొన్నారు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు, రుణదాతలకు నగదు వెనక్కి ఇ‍వ్వలేదు, వీరందరూ ప్రస్తుతం తనపై ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పారు. వీరి చేతులో తన జీవితం ప్రమాద బారిన పడుతుందని అన్నారు. చోక్సి సమర్పించిన ఈ అప్లికేషన్‌పై స్పందించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను స్పెషల్‌ పీఎంఎల్‌ఏ జడ్జీ ఎంఎస్‌ అజ్మి ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 18 చేపడతామని పేర్కొన్నారు. చోక్సి, అతని మేనల్లుడు నీరవ్‌ మోదీలు, మోసపూరిత గ్యారెంటీలతో పీఎన్‌బీలో దాదాపు రూ.13,00 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెలుగులోకి వచ్చి, పీఎన్‌బీ ఫిర్యాదు చేయడానికి కంటే ముందే, వీరిద్దరూ భారత్‌ విడిచి పారిపోయారు. భారత్‌లో చోక్సిక చెందిన బ్యాంక్‌ అకౌంట్లను, ఆస్తులను దర్యాప్తు సంస్థలు సీజ్‌  చేశాయి. భారత్‌లో అతనికి చెందిన ఆయన ఆఫీసులను మూసి కూడా వేశాయి. చోక్సికి వ్యతిరేకంగా నాన్‌-బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంటీ కూడా జారీ అయింది. ఈ అరెస్ట్‌ వారెంటీని రద్దు చేయాలని కూడా అతను కోరుతున్నాడు.
 

మరిన్ని వార్తలు