మూడు సాధారణ బీమా కంపెనీల విలీనం

2 Feb, 2018 01:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ ప్రక్రియలో భాగంగా మూడు సాధారణ బీమా సంస్థలను ఒకే కంపెనీ కింద విలీనం చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. విలీనానంతరం ఏర్పడే సంస్థను స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్‌ చేయనున్నట్లు వివరించారు. నేషనల్‌ ఇన్సూరెన్స్, యునైటెడ్‌ ఇండియా అష్యూరెన్స్, ఓరియంటల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఒకే బీమా కంపెనీగా విలీనం చేస్తామని, ఆ తర్వాత కొత్తగా ఏర్పాటైన సంస్థను లిస్టింగ్‌ చేస్తామని జైట్లీ పేర్కొన్నారు. ఎయిరిండియా సహా 24 ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటాల విక్రయ ప్రక్రియ జరుపుతున్నట్లు జైట్లీ తెలిపారు.    

 పీఎంఎల్‌ఏ పరిధిలోకి కార్పొరేట్‌ మోసాలు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ నిరోధక చట్టాన్ని (పీఎంఎల్‌ఏ) మరింత పటిష్టం చేసే దిశగా కార్పొరేట్‌ మోసాలను కూడా ఈ చట్టం పరిధిలోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. మోసపూరితంగా ఆర్జించిన సొమ్మును విదేశాలకు తరలించిన పక్షంలో.. దేశీయంగా సదరు వ్యక్తులకున్న ఆస్తులను జప్తు చేసే విధంగా పీఎంఎల్‌ఏ చట్టానికి సవరణలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పీఎంఎల్‌ఏ కింద అన్నిరకాల నేరాల్లోనూ ఒకే తరహా బెయిల్‌ షరతులు ఉండేలా ఫైనాన్స్‌ బిల్లు 2018లో ప్రతిపాదించినట్లు పేర్కొంది.

మొబైల్‌ ఫోన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థకు రూ.15 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలో మొబైల్‌ ఫోన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు రూ.15 కోట్లు కేటాయించాలని బడ్జెట్‌లో ప్రతిపాదించింది. తద్వారా నకిలీ హ్యాండ్‌సెట్స్‌ సంఖ్య దిగివస్తుందని, ఫోన్ల దొంగతనాలు తగ్గుతాయని అంచనా. టెలికం శాఖ (డాట్‌)లో భాగంగా సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్స్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) వ్యవస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నేతృత్వంలో ఏర్పాటు కానుంది. ఇది దొంగతనానికి గురైనా లేదా పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లలో అన్ని సేవలను నిలిపివేస్తుంది. ఆయా ఫోన్లలో ఏ నెట్‌వర్క్‌ ఉన్నా, చివరకు సిమ్‌ కార్డు తీసేసినా, ఆఖరికి ఐఎంఈఐ నంబర్‌ను మార్చేసినప్పటికీ సర్వీసులను బ్లాక్‌ చేస్తుంది.

మరిన్ని వార్తలు