మార్కెట్ల జోరు- మెటల్‌ స్టాక్స్‌ హవా

9 Jul, 2020 11:11 IST|Sakshi

సెన్సెక్స్‌ 204 పాయింట్లు ప్లస్‌

56 పాయింట్లు ఎగసిన నిఫ్టీ

మెటల్‌ ఇండెక్స్‌ 2.5% అప్‌

ఒక్క రోజు వెనకడుగు తదుపరి తిరిగి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 204 పాయింట్లు పెరిగి 36,533కు చేరగా.. నిఫ్టీ 56 పాయింట్లు పుంజుకుని 10,761ను తాకింది.విదేశీ మార్కెట్లో బేస్‌ మెటల్స్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యలో తాజాగా మెటల్‌ రంగం జోరందుకుంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2.5 శాతం ఎగసింది. మెటల్‌ కౌంటర్లలో హిందాల్కో, సెయిల్‌, జిందాల్‌ స్టీల్‌, టాటా స్టీల్‌, నాల్కో, వేదాంతా 4.3-3 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర కౌంటర్లలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌ఎండీసీ, వెల్‌స్పన్‌ కార్ప్‌, హిందుస్తాన్‌ కాపర్‌, హిందుస్తాన్‌ జింక్‌ 2-1.4 శాతం మధ్య పుంజుకున్నాయి.

కారణమేవిటంటే?
కోవిడ్‌-19 విస్తరిస్తున్న కారణంగా వివిధ లోహాల ఉత్పత్తికి విఘాతం కలుగుతుండటం ప్రధానంగా బేస్‌ మెటల్‌ ధరలకు రెక్కలనిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజీ(ఎల్‌ఎంఈ)లో కాపర్‌ ధరలు మార్చి కనిష్టం నుంచి తాజాగా 40 శాతం ర్యాలీ చేసినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. చిలీలో కాపర్‌ మైనింగ్‌కు బ్రేక్‌పడగా.. చైనా నుంచి డిమాండ్‌ పెరగడం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. మార్చిలో కాపర్‌ ధరలు 45 నెలల కనిష్టాలకు చేరిన విషయం విదితమే. ఈ బాటలో జింక్‌, అల్యూమినియం ధరలు సైతం ఎల్‌ఎంఈలో ఫిబ్రవరి తదుపరి గరిష్టాలకు చేరాయి. జింక్‌ టన్ను ధర ప్రస్తుతం 2131 డాలర్లను అధిగమించింది.

మరిన్ని వార్తలు