‘ఫార్చూన్‌’ బిజినెస్‌ పర్సన్‌.. నాదెళ్ల

21 Nov, 2019 04:43 IST|Sakshi
నాదెళ్ల, జయశ్రీ, బంగా

ఈ ఏడాది జాబితాలో తొలి స్థానం

అజయ్‌ బంగా, జయశ్రీ ఉల్లాల్‌కు కూడా చోటు

శాన్‌ ఫ్రాన్సిస్కో: తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల.. ఈ ఏడాది ‘ఫార్చూన్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2019’ జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ధైర్యంగా లక్ష్యాలను చేరుకోవడం, అసాధ్యాలను సుసాధ్యం చేయడం, సృజనాత్మక పరిష్కార మార్గాలను కనుగొనడం వంటి కీలక అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో మొత్తం 20 మంది పేర్లు ఉండగా.. వీరిలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన వారే ఉండడం విశేషం. ఇక తెలుగు వాడైన సత్య నాదెళ్ల తొలి స్థానంలో ఉండడం మరో విశేషం.

వ్యూహాత్మక నాయకుడి పాత్రలో ఒదిగిపోయిన ఆయన.. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా దూసుకుపోతూ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడం ద్వారా ఈ స్థానానికి చేరుకోగలిగారని ఫార్చూన్‌ మ్యాగజైన్‌ ఈ సందర్భంగా కొనియాడింది. తాజాగా 10 బిలియన్‌ డాలర్ల పెంటగాన్‌ క్లౌడ్‌ కాంట్రాక్టును అందుకోవడంలో నాదెళ్ల చూపిన చొరవ కంపెనీని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చిందని స్వయంగా ఆ సంస్థ స్వతంత్ర డైరెక్టర్లు చెప్పినట్లు వివరించింది. బిల్‌ గేట్స్‌ వలే వ్యవస్థాపకుడు, స్టీవ్‌ బాల్‌మెర్‌ వంటి సేల్స్‌ లీడర్‌ కాకపోయినప్పటికీ.. 2014లో ఆశ్చర్యకరంగా ఆయన ఎన్నిక జరిగింది. ఇటీవలే ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ(హెచ్‌బీఆర్‌) రూపొందించిన 10 అగ్రశేణి కంపెనీల సీఈఓల జాబితాలో నాదెళ్ల కూడా ఉన్నారు.  

బంగాకు 8వ స్థానం: ఫార్చూన్‌ జాబితాలో మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు స్థానం సంపాదించారు. మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగా 8వ స్థానంలో ఉండగా.. కాలిఫోర్నియా కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ అరిస్టా హెడ్‌ జయశ్రీ ఉల్లాల్‌ 18వ స్థానంలో నిలి చారు. 2వ స్థానంలో ఫోర్టెస్క్యూ మెటల్స్‌ గ్రూప్‌ సీఈఓ ఎలిజబెత్‌ గెయినెస్, చిపోటిల్‌ మెక్సికన్‌ గ్రిల్‌ సీఈఓ బ్రియాన్‌ నికోల్‌ 3వ స్థానంలో ఉన్నారు. సింక్రొనీ ఫైనాన్షియల్‌ సీఈఓ మార్గరెట్‌ కీనే (4), ప్యూమా సీఈఓ జోర్న్‌ గుల్డెన్‌ 5వ స్థానంలో నిలిచారు.

మరిన్ని వార్తలు