న్యూఢిల్లీ: యాపిల్ సీఈవో టిక్ కుక్ పర్యటన తరువాత, మరో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనారాయణ నాదెళ్ల అలియాస్ సత్య నాదేళ్ల వంతు వచ్చినట్టుగా కనిపిస్తోంది. సాఫ్ట్వేర్ దిగ్గజం, తెలుగుతేజం ముచ్చటగా మూడోసారి భారత పర్యటనకు రానున్నారు. సత్య ఈ నెలచివరలో మరోసారి భారత సందర్శనకు రానున్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఈ నెల(మే) 30న ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రపంచ అభివృద్ధిలో టెక్ ఆవిష్కరణలు పోషిస్తున్న పాత్రపై సత్య నాదెళ్ల ప్రసంగిస్తారు. తన యాత్రలో భాగంగా వ్యాపారవేత్తలు, డెవలపర్లతో మైక్రోసాఫ్ట్ సీఈవో భేటీ కానున్నారు. ఢిల్లీలో ఒక రోజు పర్యటన సందర్భంగా కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)ఆధ్వర్యంలో 150 మంది టాప్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ పాల్గొనే ఒక ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. నాదెళ్ల భారత పర్యటనను మైక్రోసాఫ్ట్ సంస్థ, సీఐఐ ధృవీకరించాయి.
కాగా గత ఏడు నెలల్లో ఆయన భారత పర్యటనకు రావడం ఇది మూడవ సారి. యాపిల్ సీీఈవో టిమ్ కుక్ పర్యటన తరువాత, మరో సాఫ్ట్ వేర్ దిగ్గజం భారత పర్యటనకు రానుండటం ఆసక్తికరంగా మారింది.