నిరుద్యోగుల‌కు శుభవార్త‌..మైక్రోసాఫ్ట్ కీల‌క నిర్ణ‌యం

18 May, 2020 13:35 IST|Sakshi

అట్లాంటా :  సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్‌, క్లౌడ్ స్పేస్ ల‌లో 1500 కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇందుకోసం 75 మిలియ‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డితో 523,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జార్జియాలోని అట్లాంటాలో కొత్త కార్యాల‌యం రూపుదిద్దుకోనున్న‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాదిక‌ల్లా అట్లాంటాలో  మైక్రోసాఫ్ట్ కార్యాల‌యం కొలువు దీర‌నుంది. జార్జియాలో మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గ‌జం పెట్టుబ‌డులు పెట్ట‌డంపై ఆ రాష్ర్ట గవ‌ర్న‌ర్ బ్రియ‌న్ పి. కెంప్ ఆనందం వ్య‌క్తం చేశారు. దీని ద్వారా కంపెనీకి, రాష్ర్టానికి ఇరువురికి ప్ర‌యోజ‌నం చేకూరుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. (అందుకే అట్లాంటిక్‌తో భాగస్వామ్యం: ఆకాశ్‌ అంబానీ )

 అట్లాంటాలో పెట్టుబ‌డులు పెట్ట‌డం ప‌ట్ల మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ టెర్రెల్ కాక్స్ మాట్లాడుతూ.."టెక్ కంపెనీ సంస్థ‌ల‌కు కేంద్ర‌మైన అట్లాంటాలో మేము పెట్టుబ‌డులు పెట్ట‌డం ఆనందంగా ఉంది. దీని ద్వారా ఇత‌ర ప్రాంతాల‌కు మా ఉనికి విస్త‌రించ‌డానికి అవ‌కాశం ఉంది. మేం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల సంస్థ‌కి   సాంకేతికంగా, ఆర్థికంగా మ‌రింత లాభం చేకూరుతుంది” అని టెర్రెల్ కాక్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక క‌రోనా క్రైసిస్‌లోనూ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ మూడ‌వ త్రైమాసికంలో భారీ లాభాల‌ను, ఆదాయాన్ని సాధించిన‌ట్లు సంస్థ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.
(లాక్‌డౌన్‌ ఎఫెక్ట్ : మైక్రోసాఫ్ట్ దూకుడు )

మరిన్ని వార్తలు