నిమిషంలో డాక్టర్‌ కన్సల్టేషన్‌

7 Sep, 2018 01:14 IST|Sakshi

  హైదరాబాద్‌లో ఎంఫైన్‌ ఎంట్రీ

 ప్రముఖ ఆసుపత్రులతో జట్టు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బెంగళూరుకు చెందిన హెల్త్‌కేర్‌ టెక్నాలజీ కంపెనీ ఎంఫైన్‌ వినూత్న సేవలను ప్రారంభించింది. దీని ప్రత్యేకత ఏమంటే నిమిషంలోపే వీడియో కాల్‌లో ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్యులను సంప్రతించవచ్చు. ఇప్పటి వరకు ఈ సంస్థ బెంగళూరులో 30 ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకుని వైద్య సేవలను అందించింది. తాజాగా హైదరాబాద్‌లో కిమ్స్, సన్‌షైన్, కిమ్స్‌ బీబీ, మ్యాక్స్‌క్యూర్‌ సుయోష, ఏస్టర్‌ ప్రైమ్‌ ఆసుపత్రులతో చేతులు కలిపి ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. 

ఇలా పనిచేస్తుంది.. 
ఎంఫైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఒక కన్సల్టేషన్‌కు రూ.500 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. సమస్య టైప్‌ చేయగానే అందుబాటులో ఉన్న స్పెషలిస్టులు స్క్రీన్‌పై కనపడతారు. వైద్యుడితో చాట్‌ చేయవచ్చు. వీడియో కాల్‌ ద్వారా సంప్రదించవచ్చు. సమస్య ఆధారంగా వైద్యులు మందులను సిఫారసు చేస్తారు. ప్రిస్క్రిప్షన్‌ యాప్‌లో వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 15 స్పెషాలిటీలకుగాను 100 మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. పరిచయ ఆఫర్‌లో భాగంగా రూ.1,999లకు ఆరు నెలల వాలిడిటీతో అపరిమిత కన్సల్టేషన్‌ను అందిస్తోంది. 

రెండేళ్లలో 200 ఆసుపత్రులు.. 
ఈ–కామర్స్‌ కంపెనీ మింత్రా సహ వ్యవస్థాపకుడు అశుతోష్, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌ కొంపల్లి ఎంఫైన్‌ను ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బందిలో 20 మంది వైద్యులే. భారత్‌లో నాణ్యమైన వైద్య సేవలకు డిమాండ్‌ ఉందని ఎంఫైన్‌ సహ వ్యవస్థాపకులు ప్రసాద్‌ గురువారమిక్కడ మీడి యాకు తెలిపారు. ‘ప్రముఖ ఆసుపత్రిలో పనిచేసే వైద్య నిపుణుడిని నిమిషాల్లో సంప్రదించేందుకు ఈ యాప్‌ దోహదం చేస్తుంది. రెండేళ్లలో 200 ఆసుపత్రులతో భాగస్వామ్యం చేసుకోవాలన్నది లక్ష్యం. తద్వారా 25 స్పెషాలిటీలు, 1,500 మంది వైద్యుల స్థాయికి చేరతాం. 10 నగరాలకు విస్తరించడం ద్వారా 5 లక్షల మందికి సేవలు అందించాలన్నది ఆశయం’ అని వివరించారు.  

మరిన్ని వార్తలు