ఎంఅండ్ఎం ఫైనాన్స్‌ రైట్స్‌@ రూ. 50

20 Jul, 2020 13:03 IST|Sakshi

క్యూ1 ఫలితాలు భేష్‌

1:1 నిష్పత్తిలో రైట్స్‌

షేరు  9 శాతం జూమ్‌

జులై 23న రికార్డ్‌ డేట్‌

వరుసగా మూడో రోజు హుషారుగా కదులుతున్న మార్కెట్లలో ఎన్‌బీఎఫ్‌సీ..  ఎంఅండ్ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతోపాటు రైట్స్‌ ఇష్యూ చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..

300 శాతం ప్లస్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 300 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతమే పెరిగి రూ. 2838 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ ప్రాతిపదికన జూన్‌ చివరికల్లా నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 14 శాతం వృద్ధితో రూ. 81,436 కోట్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో ఈ షేరు 9.3 శాతం దూసుకెళ్లి రూ. 227 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 234 వరకూ ఎగసింది.  

1:1 రైట్స్‌ 
వాటాదారులకు 1:1 నిష్పత్తిలో రైట్స్‌ ఇష్యూ జారీకి బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ తాజాగా వెల్లడించింది. ఒక్కో షేరుకీ రూ. 50 ధరలో చేపట్టనున్న రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ. 3089 కోట్లవరకూ సమీకరించనున్నట్లు తెలియజేసింది. ఇష్యూకి ఈ నెల 23(గురువారం) రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై ఆగస్ట్‌ 11న ముగియనున్నట్లు తెలియజేసింది. రైట్స్‌లో భాగంగా వాటాదారులు తమ వద్దనున్న ప్రతీ 1 షేరుపై మరొక షేరుని పొందేందుకు వీలుంటుంది. ఇందుకు రూ. 50 ధరను చెల్లించవలసి ఉంటుంది. రైట్స్‌లో భాగంగా రూ. 2 ముఖ విలువగల దాదాపు 62 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించనుంది.

మరిన్ని వార్తలు