మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ట్రాక్టర్ల విక్రయాలు 1 శాతం తగ్గాయి. మే నెలలో ట్రాక్టర్ల విక్రయాలు ఒక శాతం తగ్గి 24,341 యూనిట్లుగా నమోదయ్యాయని సోమవారం ఎంఅండ్ఎం వెల్లడించింది. గతేడాది మేలో విక్రయాలు 24,704 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ ట్రాక్టర్ల విక్రయాలు స్థిరంగా ఉన్నాయని, గతేడాది 23,539 యూనిట్లుగా ఉంటే ప్రస్తుతం 24,017యూనిట్లుగా నమోదైనట్లు పేర్కొంది. ట్రాక్టర్ ఎగుమతులు 72 శాతం తగ్గి 324 యూనిట్లుగా నమోదయ్యాయి. గత మేలో ఈ ఎగుమతులు 1,165 యూనిట్లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ వ్యవసాయ రంగానికి కొంతమేర సడలింపులు ఇవ్వడంతో మే నెలలో ట్రాక్టర్ల డిమాండ్ పెరిగిందని ఎంఅండ్ఎం లిమిటెడ్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా చెప్పారు. బలమైన రబీ పంటల ఉత్పత్తి, సకాలంలో రుతపవనాల ఆగమనంతో ఖరీప్ పంటలకు మంచి దిగుబడి రావడం వల్ల ట్రాక్టర్లకు డిమాండ్ బావుంటుందని ఆయన అన్నారు. కాగా నేడు బీఎస్ఈలో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు దాదాపు 6 శాతం లాభపడి రూ.461.40 వద్ద ముగిసింది.