ఇక మొబైల్‌ ఆధార్‌ను వాడుకోవచ్చు 

28 Oct, 2017 13:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విమానశ్రయాల్లోకి ప్రవేశించడానికి గుర్తింపుగా మొబైల్‌ ఆధార్‌ను అనుమతించనున్నట్టు ఏవియేషన్‌ సెక్యురిటీ ఏజెన్సీ బీసీఏఎస్‌ సర్క్యూలర్‌ జారీచేసింది. విమానశ్రయ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి ప్రయాణికులు తాము నిర్దేశించిన 10 ఐడెంటీ ప్రూఫ్స్‌లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని బీసీఏఎస్‌ పేర్కొంది. వీటిలో పాస్‌పోర్టు, ఓటర్‌ ఐడీ కార్డు, ఆధార్‌ లేదా మొబైల్‌ ఆధార్‌, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సులున్నాయి. సెక్యురిటీ స్టాఫ్‌తో ఎదురయ్యే వివాదాల నుంచి తప్పించుకోవడానికి ప్రయాణం కోసం తమ పేరుపై తీసుకున్న వాలిడ్‌ టిక్కెట్‌, ఫోటో గుర్తింపుతో ఉన్న ఏదైనా ఒక ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ను తెచ్చుకోవాలని బీసీఎఎస్‌ సర్క్యూలర్‌ సూచించింది. 

జాతీయ బ్యాంకు జారీచేసిన పాస్‌బుక్‌, పెన్షన్‌ కార్డు, డిసేబిలిటీ ఫోటో ఐడెంటిఫికేషన్‌, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సర్వీసు ఫోటో ఐడీ కార్డు, పీఎస్‌యూ, లోకల్‌ బాడీస్‌, ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీచేసే కార్డులను కూడా గుర్తింపు ఆధారాలుగా ఆమోదించనున్నట్టు పేర్కొంది. విద్యార్థులైతే ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌ జారీచేసే ఐడీ కార్డు సమర్పించవచ్చని తెలిపింది. ఐడెంటీ ప్రూఫ్‌ నుంచి మైనర్లను పరిమితిస్తున్నట్టు ఈ సర్క్యూలర్‌ వెల్లడించింది. ఒకవేళ పైన పేర్కొన్న 10 డాక్యుమెంట్లలో ఏదీ లేకపోతే, గ్రూప్‌ ఏ గెజిటెడ్‌ ఆఫీసర్‌ జారీచేసిన సర్టిఫికేట్‌ ఏది ఉన్నా అనుమతించనున్నట్టు బీసీఏఎస్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు