భారత్‌లో మొబైల్ సర్వీసుల విశ్వరూపం

27 Nov, 2015 01:19 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ సర్వీసుల రంగం భారీగా విస్తరించనుంది. 2020 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ రంగం వాటా 8.2%కి (దాదాపు రూ. 14 లక్షల కోట్లు)  చేరుతుందని గ్లోబల్ టెలికం ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ జీఎస్‌ఎంఏ అధ్యయనం ఒకటి పేర్కొంది. ‘‘ది మొబైల్ ఎకానమీ: ఇండియా 2015’ పేరుతో ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. 2014 జీడీపీలో ఈ రంగం వాటా 6.1% ఉందని, పరిమాణంలో ఇది రూ.7.7 లక్షల కోట్లని నివేదిక విడుదల సందర్భంగా జీఎస్‌ఎంఏ ఆసియా హెడ్ అలేస్‌దర్ గ్రాట్  పేర్కొన్నారు.  2014లో ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు.
 
 2020 నాటికి ఈ సంఖ్య 50 లక్షలకు చేరుతుందని వివరించారు. పన్నులు, స్పెక్ట్రమ్ ఆక్షన్ చెల్లింపుల రూపంలో 2014లో ప్రభుత్వానికి ఈ రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉందని తెలిపింది. ఈ మొత్తం దాదాపు రూ. 1.1 లక్షల కోట్లుగా తెలిపింది. కాగా భారత్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటినట్లు ట్రాయ్ వెల్లడించగా.. వాస్తవ యూజర్ల సంఖ్య దాదాపు 45.3 కోట్లుగా జీఎస్‌ఎంఏ నివేదిక పేర్కొంటోంది. ఈ ఏడాది ఈ సంఖ్య 50 కోట్లు దాటుతుందని తెలిపింది. 2014 దేశజనాభాలో మొబైల్ వినియోగ రేటును ట్రాయ్ 74%గా పేర్కొంటే నివేదిక మాత్రం 36%గా అంచనావేసింది.

a

మరిన్ని వార్తలు