2024 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లు అసాధ్యమే

13 Jan, 2020 04:09 IST|Sakshi

ఆర్థికవేత్త నాగరాజ్‌

న్యూఢిల్లీ: 2024 నాటికి దేశ జీడీపీని 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా, దీన్ని ఆచరణ సాధ్యం కాని లక్ష్యంగా ప్రముఖ ఆర్థికవేత్త ఆర్‌ నాగరాజ్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని 2024 నాటికి సాధించాలంటే జీడీపీ వృద్ధి రేటు ఏటా 9% ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తు తం మన జీడీపీ సుమారు 2.8 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఐదేళ్లలో రెట్టింపు అయితేనే కేంద్రం లక్ష్యం నెరవేరుతుంది. ఈ లక్ష్యం అసాధ్యమైనది కాకపోయినా, ఈ దశాబ్దంలో సాధ్యం కాకపోవచ్చని నాగరాజ్‌ పేర్కొన్నారు. 

వృద్ధి రేటు పడిపోతున్న క్రమంలో ఈ లక్ష్యం ఊహించుకోలేని అత్యాశగా ఉందన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు సెపె్టంబర్‌ త్రైమాసికంలో 4.5%కి క్షీణించిన విషయం తెలిసిందే. పెరిగిపోతున్న వాణిజ్య ఉద్రిక్తతల ధోరణి మారకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘జీడీపీలో భారత ఎగుమతుల నిష్పత్తి 2010 నుంచి క్రమంగా క్షీణిస్తోంది. ఈ ధోరణి మారుతుందన్న సంకేతాలు ఏవీ కనిపించడం లేదు’’ అని నాగరాజ్‌ తెలిపారు. గత కొన్నేళ్లుగా తగ్గుతున్న వడ్డీ రేట్లు ఏ విధంగానూ సాయపడలేదని, ద్రవ్య ప్రోత్సాహకాల అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు