2020లో భారత్‌ వృద్ధి 5.4 శాతమే..: మూడీస్‌

18 Feb, 2020 07:43 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వృద్ధి 2020 అంచనాలకు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ– మూడీస్‌ కోత పెట్టింది. స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు కేవలం 5.4 శాతమే ఉంటుందని పేర్కొంది. ఇంతక్రితం 2019 నవంబర్‌లో వేసిన అంచనా ప్రకారం ఈ రేటు 6.6%. ఆర్థిక రికవరీ అంచనాలకన్నా నెమ్మదిగా ఉందని తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఇక 2021లో భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలకూ మూడీస్‌ కోత పెట్టింది. ఈ రేటును 6.7% నుంచి 6.6 శాతానికి కుదించింది. క్యాలెండర్‌ ఇయర్‌ ప్రాతిపదకన వేసిన ఈ అంచనాల ప్రకారం– 2019లో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 5%. అంతర్జాతీయ అంశాలకన్నా దేశీయ అంశాలే భారత్‌ వృద్ధిపై కొంత అధిక ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అవుట్‌లుక్‌ పేర్కొంది. దేశీయ డిమాండ్‌ పెంపు, బ్యాంకింగ్‌ మందగమనం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆర్థిక వృద్ధి మెరుగుపడ్డానికి ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆర్థిక ఉద్దీపనలకు 2020 బడ్జెట్‌ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని వివరించింది.

మరిన్ని వార్తలు