మూడీస్ నిర్ణయం
బీఏ3 నుంచి బీఏ2కు అప్
కేంద్ర తాజా మూలధన కల్పన కారణం
ముంబై: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దీర్ఘకాలిక దేశీయ, విదేశీ కరెన్సీ డిపాజిట్స్ రేటింగ్ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ రేటింగ్ బీఏ3గా ఉంటే దీనిని బీఏ2కు అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు కేంద్రం తగిన తాజా మూలధనం సమకూర్చుతుండడం తమ రేటింగ్ అప్గ్రేడ్కు కారణమని మూడీస్ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్లకు ఉన్న బీఏఏ3/పీ–3 రేటింగ్ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కూడా మూడీస్ వివరించింది.
గత నెల్లో కేంద్రం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.48,200 కోట్ల తాజా మూలధనాన్ని అందించింది. ఇందులో సెంట్రల్ బ్యాంక్కు రూ. 2,560 కోట్లు లభించగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కు రూ.3,810 కోట్లు సమకూరాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.4,640 కోట్లు, యూనియన్ బ్యాంక్కు రూ. 4,110 కోట్లు లభించాయి. 2018 డిసెంబర్ నుంచి జనవరి 2019 మధ్య ఐఓబీకికి రూ.6,690 కోట్ల తాజా మూలధనం లభించింది.