రేట్ల పెంపు బాటలో మరిన్ని బ్యాంకులు 

9 Jun, 2018 00:52 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఆర్‌బీఐ  రెపో రేటును పావుశాతం పెంచిన నేపథ్యంలో... పలు బ్యాంకులు ఈ భారాన్ని కస్టమర్లకు బదలాయిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సిండికేట్‌ బ్యాంక్, ఓబీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు మార్జినల్‌ కాస్ట్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 0.15 శాతం వరకూ పెంచాయి. వచ్చే వారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి.  

►బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంసీఎల్‌ఆర్‌ ప్రతి కాలపరిమితిపై రేటును 0.10 శాతం పెంచింది.  దీనితో ఏడాది కాలానికి రేటు 8.50 శాతానికి చేరుతుంది. ఓవర్‌నైట్‌ రేటు  7.90కి చేరింది.  నెల రేటు 8.20కి, మూడు నెలల రేటు 8.30కి చేరింది. ఆరు నెలల రేటు 8.45 శాతానికి చేరుతుంది. 
► ఓబీసీ రేటు 0.10–0.15% పెరిగింది. 
►   సిండికేట్‌ బ్యాంక్‌ ఏడాది కాలానికి సంబంధించిన రేటును 0.05 శాతం పెంచింది.  
► రేటు పెంపును ముందే అంచనావేసిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ, ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సహా పలు బ్యాంకులు తమ మార్జినల్‌ కాస్ట్‌ (నిధుల సమీకరణకు సంబంధించి వ్యయాలు) ఆధారిత రుణ రేటును అప్పటికే కొంత పెంచేశాయి. గురువారం ఇండియన్‌ బ్యాంక్, కరూర్‌వైశ్యా బ్యాంక్‌లు రేటు పెంపు నిర్ణయం తీసుకున్నాయి.    

మరిన్ని వార్తలు