5జీ టెక్నాలజీపై సిస్కో దృష్టి
రెండవ విడత ఇన్వెస్ట్మెంట్లకు శ్రీకారం
న్యూఢిల్లీ: నూతన ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చే దిశగా రెండో విడత ’కంట్రీ డిజిటల్ యాక్సిలరేషన్’ (సీడీఏ) కార్యక్రమం కింద భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా టెక్ దిగ్గజం సిస్కో సీఈవో చక్ రాబిన్స్ తెలిపారు. దీంతో సీడీఏ కింద రెండో విడత ఇన్వెస్ట్మెంట్స్ అందుకున్న అతి కొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పౌరులకు మెరుగైన సర్వీసులు అందించడంలో 5జీ టెక్నాలజీని మరింతగా వినియోగంలోకి తేవడంపైనా దృష్టి సారిస్తున్నట్లు రాబిన్స్ తెలిపారు. ఇప్పటికే నీతి ఆయోగ్, భారత్ సంచార్ నిగమ్ (బీఎస్ఎన్ఎల్)తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన వివరించారు.
50 ప్రాజెక్టులు పూర్తి
సీడీఏ తొలి విడతలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో సిస్కో 50 ప్రాజెక్టులు పూర్తి చేసింది. వీటిలో 10 ఇన్నోవేషన్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా చేయబోయే కొత్త పెట్టుబడులు.. వినూత్న డిజిటల్ టెక్నాలజీలతో పాటు పౌర సేవల్లో 5జీ సాంకేతిక వినియోగాన్ని పెంచే కొత్త ఆవిష్కరణలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినట్లు సీఈవో చక్ రాబిన్స్ పేర్కొన్నారు.