కార్స్‌24లో ధోనీ పెట్టుబడి

14 Aug, 2019 10:55 IST|Sakshi

న్యూఢిల్లీ: గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేసే టెక్నాలజీ ఆధారిత సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయ సంస్థ ‘కార్స్‌24’లో.. టీం ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ పెట్టుబడి పెట్టినట్లు ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా మాజీ కెప్టెన్‌ వ్యవహరించనున్నారని వెల్లడించింది. ఆర్థిక పరమైన విషయాలను వెల్లడించని ఈ సంస్థ.. పెట్టుబడి డీ–రౌండ్‌ ఆఫ్‌ ఫండింగ్‌లో భాగమని పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ విక్రమ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న ధోని తనకు ఎదురైన ప్రతి సమస్యను చక్కగా పరిష్కరించారు. ఇటువంటి గొప్ప వ్యక్తి మా సంస్థకు భాగస్వామికావడం విశేషం’ అని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా 230 నగరాల్లో 10,000 ఛానల్‌ భాగస్వాములను కలిగిన ఈ సంస్థకు 35 నగరాల్లో 155 శాఖలు ఉన్నాయి. ఇటీవలే ఫ్రాంచైజ్‌ మోడల్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. 2021 నాటికి 300 ద్వితీయ శ్రేణి నగరాల్లోకి చొచ్చుకునిపోవడమే లక్ష్యంగా తెలిపింది.

మరిన్ని వార్తలు