ముఖేష్‌ అంబానీ మరో బంపర్‌ ఆఫర్‌

5 Jul, 2018 12:19 IST|Sakshi

ముంబై : జియో ఫోన్‌ హై-ఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్‌ అంబానీలు మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ ఫోన్‌ కోసం ముఖేష్‌ అంబానీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. జియోఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి మాన్‌సూన్‌ హంగామా ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఈ ఆఫర్‌ ద్వారా కొత్త జియోఫోన్‌ను కేవలం 501 రూపాయలకే, పాత ఫీచర్‌ ఫోన్ల ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేయొచ్చని ప్రకటించారు. జూలై 21 నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అయితే కమర్షియల్‌గా ఈ కొత్త జియోఫోన్‌ 2 విక్రయాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ.2,999గా ముఖేష్‌ అంబానీ చెప్పారు. నేడు ముంబైలోని న్యూ మెరైన్ లైన్స్‌లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో జరిగిన  41వ వార్షికోత్సవ సమావేశంలో పలు సర్వీసులను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రవేశపెట్టింది. 

జియో​ఫోన్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఫీచర్లను కూడా ఇషా, ఆకాశ్‌లు ప్రవేశపెట్టారు. జియోఫోన్‌ 20 కోట్లకు పైగా వాయిస్‌ కమాండ్లను సృష్టిస్తుందని తెలిపారు. 100 మిలియన్‌ యూజర్ల టార్గెట్‌గా అడ్వాన్స్‌ ఫీచర్లతో ఈ జియోఫోన్‌ 2ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే జియోఫోన్‌ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది జీరోకే జియో ఫీచర్‌ఫోన్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌కు అడ్వాన్స్‌డ్‌ గా మరిన్ని ఫీచర్లను జతచేరుస్తూ జియోఫోన్‌ 2ను రిలయన్స్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

చదవండి : ‘జియో గిగాఫైబర్‌’ను ప్రవేశపెట్టిన రిలయన్స్‌ 

మరిన్ని వార్తలు