మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ

11 May, 2020 11:11 IST|Sakshi

జియోలో ఇన్వెస్ట్‌ చేయనున్న సౌదీ కంపెనీ

సాక్షి, న్యూఢిల్లీ: బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ  నేతృత‍్వంలోని  రిలయన్స్ జియో  మరో భారీ పెట్టుబడుల స్వీకరణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మెగా ఒప్పందాల ప్రకటనతో హ్యాట్రిక్‌​ కొట్టిన రిలయన్స్ నాలుగో ఒప్పందానికి చేరువలో వుందన్న నివేదికలు వ్యాపార వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెట్రోకెమికల్స్ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నిస్తున్నందున అంబానీ తాజాగా పెద్ద ఒప్పందాన్ని చేసుకోనున్నారని  విశ్వసనీయ వర్గాల సమాచారం. సౌదీ అరేబియా  పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్‌), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  జియో ప్లాట్‌ఫామ్స్ యూనిట్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోందట. (జియో హాట్రిక్ : మరో మెగా డీల్)

మరోవైపు ఎయిర్‌ బిఎన్‌బీ, ఉబెర్ టెక్నాలజీస్ ఇంక్‌లకు నిధులు సమకూర్చిన అమెరికా పెట్టుబడి సంస్థ జనరల్ అట్లాంటిక్, జియో ప్లాట్‌ఫామ్‌లో సుమారు 850- 950 మిలియన్ డాలర్ల పెట్టుబడుల గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ఖరారు కానప్పటికీ ఈ నెలలోనే ఈ ఒప్పందం పూర్తి కానుందని భావిస్తున్నారు. అయితే ఈ అంచనాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్,  సౌదీ పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అధికారికంగా స్పందించాల్సి వుంది. అటు జనరల్ అట్లాంటిక్  ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

కాగా  జియోలో 10 శాతం వాటా కొనుగోలు ద్వారా ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ నుంచి మొతం 8 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 60,600 కోట్లు) పెట్టుబడులను రిలయన్స్  ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు