ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

20 Jul, 2019 12:28 IST|Sakshi

ముకేశ్‌ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లు

 వరుసగా 11వ ఏడాది  కూడా వేతన పరిమితి

రూ.24కోట్లను వదులుకుంటున్న ముకేశ్‌ అంబానీ

సాక్షి, ముంబై:  బిలయనీర్‌,  రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వార్షికవేతనాన్ని మరోసారి పరిమితం చేసుకున్నారు. వరుసగా 11 సంవత్సరం కూడా  వేతనాన్ని రూ.15 కోట్లుగా నిర్ణయించారు.  2008-09 నుంచి ఆయన జీతం, ఇతర అలవెన్సులు కలిపి రూ .15 కోట్లకు మించకుండా జాగ్రత్తపడుతున్నారు.  అంటే సంవత్సరానికి  దాదాపు రూ. 24 కోట్లను వదులకుంటున్నారు.  కాగా 2019 ఆర్థిక సంవత్సారానికి గాను  నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వా సహా కంపెనీలోని పూర్తి కాలం డైరెక్టర్ల జీతం  భారీగా పుంజుకుంది.  ఆర్‌ఐఎల్‌విడుదల చేసిన  వార్షిక నివేదికలో ఈ వివరాలను ప్రకటించింది. 

అంబానీ బంధువులైన నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వానీల ఒక్కొక్కరి వేతనం రూ .20.57 కోట్లకు పెరిగింది.  ఇది  2017-18లో  రూ .19.99 కోట్లు,  2016-17లో రూ .16.58 కోట్లు గా ఉంది. అలాగే, అతని ముఖ్య కార్యనిర్వాహకులలో ఒకరైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఎం ఎస్ ప్రసాద్ అతని వేతనం గత ఏడాదితో  పోలిస్తే  రూ .8.99 కోట్ల నుంచి రూ .10.01 కోట్లకు పెరిగింది.  

నీతా అంబానీతో సహా ఆర్‌ఐఎల్‌కు చెందిన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సిట్టింగ్ ఫీజుతో పాటు ఒక్కొక్కరికి 1.65 కోట్ల రూపాయలు కమిషన్‌గా లభించాయి. ఈ కమిషన్ 2017-18లో రూ .1.5 కోట్లు, అంతకుముందు సంవత్సరంలో రూ .1.3 కోట్లు మాత్రమే.  అయితే 2018 అక్టోబర్ 17న  ఆర్‌ఐఎల్ బోర్డులోమాజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్ అరుంధతి భట్టాచార్య  రూ. 75 లక్షలను మాత్రమే కమిషన్‌గా పొందారు. కంపెనీ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  ముకేశ్‌ అంబానీ భార్య నీతా అంబానీకి ఫీజుగా రూ .7 లక్షలు దక్కాయి.  అంతకుముందు సంవత్సరంలో ఇది రూ .6 లక్షలు.  అంబానీతో పాటు, ఆర్‌ఐఎల్ బోర్డులో మెస్వానీ సోదరులు, ప్రసాద్, కపిల్‌లు హోల్‌టైమ్ డైరెక్టర్లుగా ఉండగా, నీతా అంబానీతో పాటు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో మన్సింగ్ ఎల్ భక్తా, యోగేంద్ర పీ త్రివేది, దీపక్ సీ జైన్, రఘునాథ్ ఎ మషెల్కర్, ఆదిల్ జైనుల్‌భాయ్‌ రమీందర్ సింగ్ గుజ్రాల్, షుమీత్ బెనర్జీ ,  అరుంధతి భట్టాచార్య ఉన్నారు. కాగా  కార్పొరేట్ సీఈవోల వేతనాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటున్నాయన్న విమర్శల నేపథ్యంలో  2009 అక్టోబర్‌లో స్వచ్ఛందంగా తన వేతనాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు