2019లో దూసుకుపోయిన ఇండియన్‌ టైకూన్‌

24 Dec, 2019 20:16 IST|Sakshi
, రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ (ఫైల్‌ ఫోటో)

18 బిలియన్ డాలర్ల  మేర పుంజుకున్న అంబానీ సంపద

ఇది  జాక్‌ మా, జెఫ్‌ బెజోస్‌ కంటే ఎక్కువ

సాక్షి, ముంబై:  ఇండియన్‌ టై​కూన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ముకేశ్‌ అంబానీకి 2019 ఏడాది బాగా కలిసి వచ్చిన  మంచి సంవత్సరంగా నిలిచింది.  ఒక పక్క​ దేశ ఆర్థిక వ్యవస్థలో మందమనం ఆందోళన రేపుతోంటే ఆయన మాత్రం  సంపద సృష్టిలో దూసుకుపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, భారత వ్యాపారవేత్త, కుబేరుడు అంబానీ సంపద డిసెంబర్ 23 నాటికి దాదాపు 18 బిలియన్ డాలర్ల మేర  పెరిగింది. ఇది ఆసియాలో అత్యధికం.  దీంతో ఆయన సంపద నికర విలువ 61 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్లు పెరగ్గా,  జెఫ్ బెజోస్ 13.2 బిలియన్ డాలర్లు పెరిగింది. 2021 నాటికి రిలయన్స్ కంపెనీని జీరో డెబిట్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆగస్ట్ నెలలో చెప్పిన  అంబానీ ఆ వైపుగా దూసుకుపోతున్నారు. 

ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  షేర్ల విలువ 40 శాతం పెరగడంతో పుంజుకోవడం  ముకేశ్‌ అంబానీ  సంపద భారీగా పెరగడానికి దోహదపడింది. ఇదే కాలంలో ఇండియా బెంచ్ మార్క్ ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ లాభపడిన దాని కంటే రిలయన్స్ స్టాక్స్ రెండింతలు పెరిగడం గమనార్హం. ఆయిల్ అండ్ గ్యాస్, టెలి కమ్యూనికేషన్స్ సహా రీటైల్‌ వివిధ రంగాలు, పెట్టుబడులు,  రిలయన్స్‌ను ఓ స్థాయికి తీసుకు వెళ్లారని, టీసీజీ అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ చక్రి లోకప్రియ తెలిపారు. త్వరలోనే అమెజాన్‌కు పోటీగా ఇ-కామర్స్ దిగ్గజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో,  ఈ కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టనుందన్నారు. అలాగే రానున్న రిలయన్స్‌ వాటాదారుల విలువను రెట్టింపు అవుతుందని తాము నమ్ముతున్నామన్నారు.  తద్వారా రిలయన్స్ కొత్త వెంచర్స్ ద్వారా 50 శాతం ఆదాయం రానుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది 32 శాతంగా ఉంది. సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కోతో ఒప్పందం రిలయన్స్‌ షేర‍్లలో కొనుగోళ్లకు  ఊతమిచ్చాయి.(ఆరాంకోతో ప్రతిపాదిత లావాదేవీకి కేంద్రం ద్వారా ప్రస్తుతానికి అడ్డుకట్ట పడింది). దీనికితోడు  టెలికాం రంగంలో  రిలయన్స్‌ జియో  సంచలనం, ప్రత్యర్థుల ధీటుగా శర వేగంగా దూసుకెళ్లి మూడేళ్లలోనే దేశంలో నెంబర్‌ 1 గా అవతరించడం వంటివి రిలయన్స్‌కు  2019లో బాగా కలిసి వచ్చిన అంశాలు. కాగా  ఫోర్బ్స్‌ గత నెలలో  ప్రకటించిన ఈ ఏడాది ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ 9వ స్థానంలో నిలిచిన సంగతి విదితమే. 

మరిన్ని వార్తలు