హాంకాంగ్‌ టైకూన్‌ను దాటేసిన ముఖేష్‌ అంబానీ

1 Aug, 2017 14:00 IST|Sakshi
హాంకాంగ్‌ టైకూన్‌ను దాటేసిన ముఖేష్‌ అంబానీ
రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ మరో సంచలన రికార్డును కొట్టేశారు. హాంకాంగ్‌ వ్యాపార దిగ్గజం లి కా-షింగ్‌ను అధిగమించేసి, ఆసియాలోనే రెండో అత్యధిక ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చైర్మన్‌ అయిన ముఖేష్‌ అంబానీ సంపదకు ఈ ఏడాది మరో 12.1 బిలియన్‌ డాలర్లు అంటే సమారు రూ.77,000 కోట్లు కలిసినట్టు బ్లూమ్‌బర్గ్‌ బిలీనియర్స్‌ ఇండెక్స్‌ రిపోర్టు చేసింది. ఆయిల్‌ నుంచి టెలికాం వరకు ముఖేష్‌ నిర్వహిస్తున్న కంపెనీల షేర్లు మార్కెట్‌లో రికార్డులు సృష్టిస్తుడటంతో ఆయన సంపద ఈ మేర ఎగిసినట్టు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. అంబానీ ఇటీవలే మొబైల్‌ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించడానికి జీరోకే జియో ఫోన్‌ను లాంచ్‌ చేశారు. దీంతో ఆయన మార్కెట్‌ను మరింత విస్తరించనున్నారని తెలిసింది. 
 
గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్‌చేసిన టెలికాం బిజినెస్‌ల నుంచి ఇంకా ఆయన, ఆయన షేర్‌ హోల్డర్స్‌ లాభాలను ఆర్జించాల్సి ఉంది. 2012 మార్చి నుంచి గ్రూప్‌ రుణాలు మూడింతలు అయినట్టు కూడా తెలిసింది. అయితే ఆయన 90 శాతం రెవెన్యూలు రిఫైనింగ్‌, పెట్రోకెమికల్‌ యూనిట్లు, రిటైల్‌, మీడియా, ఎనర్జీ నుంచి వస్తుండటంతో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ తన సంపదను భారీగానే పెంచుకుంటున్నారు. పెరుగుతున్న రుణాలపై మాత్రం స్పందించడానికి రిలయన్స్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. 2016లో బ్లూమ్‌బర్గ్‌ బిలీనియర్‌ ఇండెక్స్‌లో 29వ స్థానంలో ఉన్న ముఖేష్‌ అంబానీ ప్రస్తుతం 34.8 బిలియన్ల డాలర్లతో 19 స్థానానికి చేరుకున్నారు.
 
రిఫైనింగ్‌, పెట్రోకెమికల్స్‌ లో పెడుతున్న పెట్టుబడులతో ప్రస్తుత ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి భారీగానే లాభాలు రానున్నట్టు ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అనాలిస్ట్‌ విశాల్‌ కుల్‌కర్ణి చెప్పారు. 2019 మార్చి వరకు ఈ వ్యాపారాల నుంచి ఆపరేటింగ్‌ లాభాలు 50 శాతం పెరుగనున్నట్టు చెప్పారు. జియో నుంచి 1 బిలియన్‌ డాలర్ల ఆపరేటింగ్‌ లాభాలు ఆర్జించి, వచ్చే ఏడాది వీటిని మూడింతలు చేసుకోనున్నట్టు అంచనావేస్తున్నారు.  
 
మరిన్ని వార్తలు