యాంఫి లక్ష్యం
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ తన నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఇప్పుడున్న రూ.25 లక్షల కోట్ల నుంచి 100 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యం విధించుకుంది. అలాగే, ఇన్వెస్టర్ల సంఖ్యను 2 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచుకోవాలన్నది పరిశ్రమ లక్ష్యమని మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫి బీసీజీ విజన్ డాక్యుమెంట్ పేర్కొంది. టాప్ 30 పట్టణాలు కాకుండా ఇతర పట్టణాల్లో(బీ30)నూ ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచుకోవాలని పరిశ్రమ భావిస్తోంది. ముంబైలో జరిగిన యాంఫి సమావేశంలో ఫండ్స్ విజన్ డాక్యుమెంట్ను సెబీ చైర్మన్ అజయ్ త్యాగి ఆవిష్కరించారు. యాం ఫీ–క్రిసిల్ ఫ్యాక్ట్ బుక్ ప్రకారం.. 2016 ఏప్రిల్ నుంచి 2019 జూలై వరకు సిప్ రూపంలో మ్యూచువల్ పండ్స్ పథకాల్లోకి రూ.2.30 లక్షల కోట్ల మేర పెట్టుబడులు రావడం పరిశ్రమ ఆస్తుల వృద్ధికి ఎక్కువగా తోడ్పడింది. సిప్ ఖాతాల సంఖ్య కూడా ఈ కాలంలో కోటి నుంచి 2.73 కోట్లకు పెరిగింది.
భద్రతను పణంగా పెట్టొద్దు :ఫండ్స్కు సెబీ చైర్మన్ త్యాగి సూచన
అధిక రాబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్ లోపభూయిష్ట మార్గాలను అనుసరించి, రిస్క్తో కూడిన పెట్టుబడులు చేశాయని... భద్రత విషయంలో రాజీ పడకుండా, నిబంధనల మేరకు నడచుకోవాల్సిన సమయం ఇదన్నారు. ‘మ్యూచువల్ ఫండ్స్ సహీ హై’ (మ్యూచువల్ ఫండ్స్ అన్నవి సరైనవి) అన్న ట్యాగ్ లైన్ను పరిశ్రమకు త్యాగి గుర్తు చేశారు. ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో కలిగిన విశ్వాసాన్ని కొనసాగించడానికి కృషి చేయాలన్నారు.