మిస్టరీ మాల్‌వేర్‌ : వీవీఐపీల ఐఫోన్లే టార్గెట్‌

14 Jul, 2018 12:44 IST|Sakshi

హైదరాబాద్‌ : ఇటీవల మాల్‌వేర్‌ వైరస్‌లు ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయో చూస్తున్నాం. వ్యక్తిగత డేటాలను చోరి చేస్తూ.. మాల్‌వేర్‌లు విజృంభిస్తున్నాయి. తాజాగా భారత్‌లో 13 ఐఫోన్లపై అనుమానిత అప్లికేషన్‌ దాడి చేసిందట. డేటాను, సమాచారాన్ని ఆ అప్లికేషన్‌ దొంగలించేసింది. 13 ఐఫోన్లే కదా..! లక్షల ఫోన్ల మాదిరి చెప్పారేంటి అనుకుంటున్నారా? కానీ చోరికి గురైనా ఆ ఐఫోన్లు వీవీఐపీలవి అంట. వీవీఐపీ స్మార్ట్‌ఫోన్లను టార్గెట్‌ చేసి, ఓ మిస్టరీ మాల్‌వేర్‌ అటాక్‌ చేసినట్టు సిస్కో టాలోస్‌ కమర్షియల్‌ థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ మాల్‌వేర్‌ రీసెర్చర్లు, అనాలిస్టులు బహిర్గతం చేశారు. అయితే ఈ వీవీఐపీలు ఎవరన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది.

భారత్‌లో ఉండే ఈ దాడి జరిపిన అటాకర్‌, రష్యాలో ఉన్నట్టు నమ్మిస్తున్నట్టు సిస్కో నిపుణులు చెప్పారు. రష్యన్‌ పేర్లు, ఈమెయిల్‌ డొమైన్లను ఇతను వాడుకున్నట్టు పేర్కొన్నారు. దాడికి రెండు వ్యక్తిగత డివైజ్‌లను వాడిన అటాకర్‌, భారత్‌లో వొడాఫోన్‌ నెట్‌వర్క్‌తో రిజిస్టర్‌ అయి ఉన్న ఫోన్‌ నెంబర్‌ను వాడినట్టు చెప్పారు. ఓపెన్‌ సోర్స్‌ మొబైల్‌ డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఎండీఎం)ను ఫోన్లలోకి చొప్పించి, ఆ 13 డివైజ్‌లలోకి అటాకర్‌ ఎన్‌రోల్‌ అయినట్టు టాలోస్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులు తమ బ్లాగ్‌లో రివీల్‌చేశారు. వాట్సాప్‌ లాంటి మెసేజింగ్‌ యాప్స్‌లోకి ఫీచర్లను యాడ్‌ చేయడం కోసం పలు టెక్నికల్స్‌ను వాడటం, టార్గెట్‌ చేసిన డివైజ్‌లలోకి ఎండీఎం చెందిన టెలిగ్రామ్‌ను చొప్పించడం ద్వారా ఈ దాడికి పాల్పడినట్టు సిస్కో మాల్‌వేర్‌ రీసెర్చర్‌ ఆడ్రూ విలియమ్స్‌, మాల్‌వేర్‌ అనాలిస్ట్‌ పౌల్‌ చెప్పారు. 

మాల్‌వేర్‌, టార్గెట్‌ చేసిన ఐఫోన్‌ డివైజ్‌ల వాట్సాప్‌, టెలిగ్రామ్‌ చాట్‌లను సేకరించడం, ఎస్‌ఎంఎస్‌లను, యూజర్ల ఫోటోలను, కాంటాక్ట్‌లను, లొకేషన్‌, సీరియల్‌ నెంబర్‌, ఫోన్‌ నెంబర్‌ లాంటి సమాచారాన్ని దొంగలించడం చేసిందని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని బ్లాక్‌మెయిల్‌ లేదా అవినీతికి ఉపయోగిస్తున్నట్టు లైనక్స్‌/యునిక్స్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ ఆన్‌లైన్‌ కమ్యూనిటీ నిక్స్‌క్రాఫ్ట్‌ చెప్పినట్టు టాలోస్‌ రీసెర్చ్‌ కోట్‌ చేసింది.  దీని బారిన పడిన ఐఓఎస్‌ డివైజ్‌ యూజర్లకు కనీసం దీని గురించే అర్థం కాదని చెప్పింది. మూడేళ్లుగా సాగుతున్న ఈ ఆపరేషన్‌ను కనీసం గుర్తించలేకపోయామని చెప్పారు.

‘ఐఫోన్‌ ప్రమాదబారిన పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆపిల్‌ ఐఫోన్‌ మాల్‌వేర్‌ ప్రభావితం బారిన పడటం తక్కువగా నమోదవుతుంటుంది. దీనిలో యూజర్ల తప్పిదం కూడా ఉంటుంది. అటాకర్లు సోషల్‌ ఇంజనీరింగ్‌ వాడుకుని ఐఫోన్లలోకి చొప్పించి ఉంటారు’ అని తెలంగాణ సీఐడీ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు యూ రామ్‌మోహన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు