గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ విస్తరణ

24 Sep, 2014 01:04 IST|Sakshi
గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ విస్తరణ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భిన్న రంగాల్లో ఉన్న గోద్రెజ్ గ్రూప్ కంపెనీ గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ ఔట్‌లెట్లను విస్తరిస్తోంది. హైదరాబాద్‌లోతోసహా ఏడు ప్రధాన నగరాల్లో సంస్థ 33 స్టోర్లను నిర్వహిస్తోంది. ఒక్కో స్టోర్‌కు రూ.1.5 కోట్ల దాకా వ్యయం చేస్తోంది.

 విదేశాల్లో లభించే అరుదైన, ఖరీదైన పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, మాంసం, వైన్, కోల్డ్ కట్స్, పాస్తా, చీజ్, బెవరేజెస్ నేచర్స్ బాస్కెట్‌లో లభిస్తాయి. మార్చికల్లా కొత్తగా 3 ఔట్‌లెట్లను ఏర్పాటు చేయనున్నట్టు గోద్రెజ్ గ్రూప్ ఈడీ, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ తాన్యా దుబాష్ తెలిపారు. మరో 6-7 స్టోర్లకై ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు.

 ఈ ఏడాదే బ్రేక్ ఈవెన్..
 నేచర్స్ బాస్కెట్ ఈ ఏడాదే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని తాన్యా దుబాష్ వెల్లడించారు. ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్ పోర్టల్స్ అయిన అమెజాన్, స్నాప్‌డీల్‌తో చేతులు కలుపుతామని చెప్పారు. ప్రథమస్థాయి నగరాల్లో అరుదైన, ఖరీదైన ఆహోరోత్పత్తులకు విపరీత డిమాండ్ ఉందని తెలిపారు. దీపావళికి గోద్రెజ్ గ్రూప్ నుంచి నూతన ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో నేచర్స్ బాస్కెట్ స్టోర్లున్నాయి. కాగా, గోద్రెజ్ గ్రూప్ వచ్చే 10 ఏళ్లకుగాను ఏటా 26 శాతం వృద్ధిని లక్ష్యంగా చేసుకుంది.

మరిన్ని వార్తలు