పుంజులాయిడ్‌ దివాలాకు ఎన్‌సీఎల్‌టీ ఓకే! 

9 Mar, 2019 00:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగం కంపెనీ పుంజ్‌లాయిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీకి వ్యతిరేకంగా ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ ఆమోదించింది. రూ.853.83 కోట్ల రుణ బకాయిలను పుంజ్‌లాయిడ్‌ చెల్లించకపోవడంతో, ఐసీఐసీఐ బ్యాంకు ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా, ఇద్దరు సభ్యుల ఎన్‌సీఎల్‌టీ ఢిల్లీ బెంచ్‌ అనుమతించింది.

ఎన్‌సీఎల్‌టీ పూర్తి ఆదేశాల కాపీ తమకు అందాల్సి ఉందని, ఆ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పుంజ్‌లాయిడ్‌ స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఐసీఐసీఐ బ్యాంకు గతేడాది జూన్‌లోనే పుంజ్‌లాయిడ్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేసింది. అయితే, కంపెనీ నిర్వహణలో పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, రుణాల పునరుద్ధరణకు అనుకూలంగా ఉన్నట్టు ఎస్‌బీఐ, ఇతర రుణదాతలు ఐసీఐసీఐ పిటిషన్‌ను వ్యతిరేకించారు. పుంజ్‌లాయిడ్‌కు రూ.6,000 కోట్ల రుణ భారం ఉంది. ఇందు లో ఐసీఐసీఐ బకాయి మొత్తం రూ.854 కోట్లు.    

మరిన్ని వార్తలు