నెఫ్ట్‌ లావాదేవీలు ఇక 24/7

7 Dec, 2019 05:27 IST|Sakshi

డిసెంబర్‌ 16 నుంచి అమల్లోకి

ముంబై: నేషనల్‌ ఎల్రక్టానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌/ఎన్‌ఈఎఫ్‌టీ) వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారనుంది. రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ (ఆదివారం, అన్ని సెలవుదినాల్లోనూ) నెఫ్ట్‌ లావాదేవీలను అనుమతించనున్నట్టు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. డిసెంబర్‌ 16న (డిసెంబర్‌ 15 అర్ధరాత్రి) 00.30 గంటలకు మొదటి నెఫ్ట్‌ సెటిల్‌మెంట్‌ జరుగుతుంది. లావాదేవీలు సాఫీగా సాగిపోయేందుకు వీలుగా బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తమ కరెంటు ఖాతాల్లో తగినంత నిధుల లభ్యత ఉండేలా చూసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లను కూడా చేసుకోవాలని కేంద్ర బ్యాంకు కోరింది.

రెండు గంటల్లోపు లావాదేవీ మొత్తం స్వీకర్త ఖాతాలో జమ చేయడం లేదా పంపిన వ్యక్తిన ఖాతాకు వెనక్కి జమ చేయడం ఇక ముందూ కొనసాగనుంది. నెఫ్ట్‌ లావాదేవీల ప్రోత్సాహానికి గాను వీటిపై చార్జీలను ఆర్‌బీఐ లోగడే ఎత్తివేసింది. నెఫ్ట్‌ లావాదేవీలను గంటకోసారి ఒక బ్యాంచ్‌ కింద క్లియర్‌ చేస్తుండడం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు.. మొదటి, మూడో శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాసెస్‌ చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు