నడత మారని పారిశ్రామికం

13 May, 2014 01:43 IST|Sakshi
నడత మారని పారిశ్రామికం

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగంలో రికవరీ కనబడ్డం లేదు. ఫిబ్రవరి తరహాలోనే (-1.8 శాతం) మార్చిలో సైతం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. ఈ సూచీ -0.5 శాతం క్షీణించింది. ప్రధాన రంగాలు తయారీ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్ పేలవ పనితీరు దీనికి ప్రధాన కారణం. అయితే ఫిబ్రవరితో పోల్చితే క్షీణత రేటు మెరుగుపడ్డమే ఇక్కడ చెప్పుకోదగింది.  కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది.  2013 మార్చి నెలలో పారిశ్రామిక వృద్ధి రేటు 3.5 శాతం.

 ప్రధాన రంగాల  పనితీరును పరిశీలిస్తే...
 తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి రేటు క్షీణతలోకి జారింది. 4.3% వృద్ధి రేటు మైనస్ 1.2%లోకి జారింది.

 మైనింగ్: సూచీలో 14 శాతం వెయిటేజ్ ఉన్న ఈ రంగంలో క్షీణత కొనసాగుతోంది. అయితే క్షీణత (-) 2.1 శాతం నుంచి 0.4 శాతానికి తగ్గింది.

 విద్యుత్: ఈ రంగంలో వృద్ధిరేటు మాత్రం బాగుంది. ఇది 3.5 శాతం నుంచి 5.4 శాతానికి మెరుగుపడింది.

 క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు ప్రధాన సూచికగా ఉండే భారీ ఉత్పత్తుల రంగం క్యాపిటల్ గూడ్స్ 9.6% వృద్ధి నుంచి మైనస్ 12.5 శాతంలోకి పడిపోయింది.

 వినియోగ వస్తువులు: ఈ రంగం 1.8% వృద్ధి నుంచి 0.9% క్షీణతలోకి చేరింది. ఈ రంగంలోని వినియోగ మన్నిక ఉత్పత్తుల్లో అసలు వృద్ధిలేకపోగా 11.8% క్షీణించింది. 2013 మార్చిలో సైతం ఈ రంగం క్షీణతలో ఉన్నా, అప్పట్లో ఇది మైనస్ 4.9 శాతం.

>
మరిన్ని వార్తలు