సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్లో కార్ల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. గత ఏప్రిల్ నెలలో వెయ్యికి లోపలనే కార్ల విక్రయాలు జరిగాయి. అంటే 97 శాతం కార్ల అమ్మకాలు పడిపోయాయి. కార్ల అమ్మకాలు ఇంత దారుణంగా పడిపోవడం 1946 తర్వాత ఇదే మొదటిసారి. ఆక్స్ఫర్డ్షైర్కు సమీపంలోని హెఫోర్డ్ వైమానిక స్థావరం రన్వేలు కొత్త కార్ల పార్కింగ్తో నిండిపోయాయి. 2019, ఏప్రిల్ నెలలో ప్రజలు వినియోగించే 68 వేల కార్లు అమ్ముడుపోగా, గత నెలలో వాటి అమ్మకాలు 871కి పడిపోయాయి. ఇక బిజినెస్ వాహనాలు గతేడాది ఏప్రిల్ నెలలో 93 వేల కార్లు అమ్ముడుపోగా, గత నెలలో 3,500 కార్లు అమ్ముడు పోయాయి. ( గుడ్ న్యూస్: త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు.. )
హెఫోర్డ్ వైమానిక స్థావరం రన్వేలో కొత్త కార్ల పార్కింగ్
1992లో ఎదురైన ఆర్థిక మాంద్యం నాటి నుంచి నేటి వరకు కార్ల అమ్మకాలు ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటి సారని ‘సొసైటీ ఆఫ్ మోటార్ మానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్’ తెలియజేసింది. లాక్డౌన్ కారణంగా కార్ల షోరూమ్లు బంద్ ఉండడం, ప్రజలు ఇళ్లకు పరిమితం కావడం ఈ పరిస్థితికి కారణమని కొందరు విశ్లేషకులు చెబుతుండగా, ఆన్లైన్ బుకింగ్లు పడిపోవడానికి ఇది కారణం కాదని, కోవిడ్ కారణంగా మార్కెట్ పట్ల అనిశ్చిత పరిస్థితి ఏర్పడడమే కారణమై ఉంటుందని, పర్యావసానంగా పరిశ్రమపై ఆధార పడి బతికే వేలాది మంది కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకం అవుతున్నాయని ఎస్ఎంఎంటీ సీఈవో మైక్ హావెస్ వ్యాఖ్యానించారు. ( లాక్డౌన్: షిర్డీ ఆలయంపై భారీ ఎఫెక్ట్! )