ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ మళ్లీ డిఫాల్ట్‌

4 Oct, 2018 00:49 IST|Sakshi

    రూ. 21 కోట్ల చెల్లింపుల్లో విఫలమైన ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో భాగమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్‌ (ఐటీఎన్‌ఎల్‌) దాదాపు రూ. 21 కోట్లు డిఫాల్ట్‌ అయింది. మూడు నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ)పై వడ్డీ చెల్లింపులు జరపలేకపోయినట్లు సంస్థ తెలిపింది. జూన్‌ 30 నుంచి సెప్టెంబర్‌ 29 మధ్యలో వీటిని చెల్లించాల్సి ఉన్నట్లు స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. 19 సిరీస్‌ బీ కింద రూ. 10.58 కోట్లు, 19ఎం సిరీస్‌ ఏపై రూ. 6.95 కోట్లు, సిరీస్‌ 3పై రూ. 3.24 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, వడ్డీ డిఫాల్ట్‌ అయినప్పటికీ బుధవారం ఐటీఎన్‌ఎల్‌ షేరు బీఎస్‌ఈలో 20 శాతం పెరిగి రూ.32.15 వద్ద క్లోజయ్యింది. దాదాపు రూ. 91,000 కోట్ల రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఇప్పటిదాకా పలు రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అయిన సంగతి తెలిసిందే.

రైట్స్‌ ఇష్యూకు సెంట్రల్‌ బ్యాంక్‌ దూరం !  
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ప్రతిపాదిత రూ.4,500 కోట్ల రైట్స్‌ ఇష్యూలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పాల్గొనకపోవచ్చని సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీ రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించాలని ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే.

నేడు బోర్డు సమావేశం .. 
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో పరిస్థితులను చక్కదిద్దే ప్రణాళికను రూపొందించేందుకు కొత్తగా ఏర్పాటైన బోర్డు గురువారం సమావేశం కానుంది. సంస్థ ఆర్థిక పరిస్థితులను మదింపు చేయడంతో పాటు తగు పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికపై బోర్డు 15 రోజుల్లో కేంద్రానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారి తెలిపారు. కంపెనీ పాత బోర్డును రద్దు చేసి ప్రముఖ బ్యాంకరు ఉదయ్‌ కొటక్‌ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో కేంద్రం కొత్త బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, గ్రూప్‌తో పాటు 160 అనుబంధ సంస్థల కార్యకలాపాలపై కూడా విచారణ జరపాలంటూ సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో)ను కూడా ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అంశాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీ సారథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థిక) అక్టోబర్‌ 30న సమావేశం కానుంది. కంపెనీలో వాటాదారులైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ప్రతినిధులతో పాటు ప్రస్తుత మేనేజ్‌మెంట్‌ను కూడా సమావేశానికి హాజరు కావాలని సూచించినట్లు మొయిలీ తెలిపారు. పార్లమెంటరీ కమిటీ రెండు నెలల్లోగా నివేదికను సమర్పించాల్సి ఉంటుందని  వివరించారు. 

>
మరిన్ని వార్తలు