ఐఫోన్‌ ఎక్స్‌ వచ్చేసింది..

4 Nov, 2017 00:47 IST|Sakshi

భారత్‌ సహా ఆసియా మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభం

ధర రూ. 89,000 నుంచి 1,02,000 దాకా  

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్‌ ఎక్స్‌(10) అమ్మకాలు శుక్రవారం భారత్‌ సహా ఆసియా మార్కెట్లలో ప్రారంభమయ్యాయి. కొనుగోలుదారులు తొలిరోజే ఐఫోన్‌ ఎక్స్‌ను దక్కించుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో ముందు రోజు రాత్రి నుంచే స్టోర్స్‌ దగ్గర బారులు తీరారు. ఫేస్‌ రికగ్నిషన్, కార్డ్‌లెస్‌ చార్జింగ్, అంచుల దాకా ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ మొదలైన ఫీచర్స్‌ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఐఫోన్‌ ప్రవేశపెట్టి పదేళ్లయిన సందర్భంగా యాపిల్‌ దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది. 64 జీబీ నుంచి 256 జీబీ దాకా స్టోరేజ్‌ సామర్ధ్యంతో లభించే ఐఫోన్‌ ఎక్స్‌ రేటు రూ. 89,000 నుంచి రూ.1,02,000 దాకా ఉంది. దీని యాక్సెసరీలు (లెదర్‌ కేస్‌లు మొదలైనవి) రూ. 3,500 నుంచి రూ. 8,600 పైచిలుకు ఉన్నాయి. మరోవైపు,  ఐఫోన్లు, ఐప్యాడ్స్‌ ఊతంతో భారత్‌లో తమ ఆదాయాలు రెట్టింపయ్యాయని యాపిల్‌ సీఎఫ్‌వో లూకా మిస్త్రి తెలిపారు.

ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌పై మరింతగా దృష్టి పెడుతున్నట్లు కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో వంటి దిగ్గజాలు టెలికం ఇన్‌ఫ్రాపై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తుండటంతో సర్వీసులు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో యాపిల్‌ ఏకంగా 52.6 బిలియన్‌ డాలర్ల ఆదాయంపై 10.7 బిలియన్‌ డాలర్ల నికర లాభాలు ఆర్జించింది. 

మరిన్ని వార్తలు