కొత్త సేవింగ్స్‌ బాండ్‌ స్కీము

5 Jan, 2018 00:08 IST|Sakshi

జనవరి 10 నుంచి సబ్‌స్క్రిప్షన్స్‌ ప్రారంభం 

న్యూఢిల్లీ: రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం కేంద్రం కొత్తగా 7.75% వడ్డీ రేటుతో కొత్త బాండ్‌ స్కీమును  ప్రకటించింది. ఏడేళ్ల మెచ్యూరిటీ వ్యవధి ఉండే ఈ బాండ్లకు జనవరి 10 నుంచి సబ్‌స్క్రిప్షన్స్‌ ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత 8 శాతం స్కీము స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్‌సి గర్గ్‌ .. ‘ట్వీట్‌’ చేశారు. వడ్డీ రేటును తగ్గించడానికి ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఏ కారణం చూపకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఇంట్రెస్ట్‌ రేట్లు తగ్గుతున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ స్కీములో వడ్డీని అర్ధ సంవత్సరానికోసారి లెక్కిస్తారు. దీంతో రూ.1,000 మేర ఇన్వెస్ట్‌ చేసిన పక్షంలో ఏడేళ్ల తర్వాత ఆ విలువ రూ.1,703గా ఉంటుంది.

ఈ బాండ్లకు పన్నులు కూడా వర్తిస్తాయి. వీటిని సెకండరీ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేసుకోవడానికి వీలుండదని, అలాగే బ్యాంకులు.. ఇతరత్రా నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే క్రమంలో తనఖా పెట్టడానికి కూడా ఈ బాండ్లు ఉపయోగపడవని కేంద్రం పేర్కొంది. రిటైల్‌ ఇన్వెస్టర్లను పెట్టుబడులవైపు ప్రోత్సహించే లక్ష్యంలో 2003లో అప్పటి ప్రభుత్వం 8% వడ్డీ రేటుతో ఆరేళ్ల వ్యవధి ఉండే సేవింగ్స్‌ బాండ్స్‌ స్కీమును ప్రవేశపెట్టింది. 

మరిన్ని వార్తలు