మీ డ్రెస్‌కు.. మీరే అడ్రెస్‌!!

14 Jul, 2018 01:23 IST|Sakshi

‘ఈనాక్షి’లో ఒక డిజైన్‌కు ఒకటే గార్మెంట్‌

ఏడాదిలో ఆఫ్‌లైన్‌ స్టోర్లు ప్రారంభం

‘స్టార్టప్‌ డైరీతో’ సంస్థ ఫౌండర్‌ నమ్యా పటేల్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘అందం అంటే మనకు నచ్చడం కాదు ఎదుటివాళ్లకు నచ్చేలా ఉండటం’’ అనే డైలాగ్‌ను సీరియస్‌గా తీసుకుంది అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌. ఎదుటివాళ్లకు నచ్చేలా మాత్రమే కాకుండా... మనం వేసుకున్న డ్రెస్‌ డిజైన్‌ ఎదుటి వాళ్లకు లేకుండా చేసేసింది. ‘ఒక మహిళ.. ఒక్క డిజైన్‌.. ఒక్కటే డ్రెస్‌’ కాన్సెప్ట్‌తో అహ్మదాబాద్‌లో ఏకంగా ‘ఈనాక్షి.కామ్‌’ను ప్రారంభించింది నమ్యా పటేల్‌. మహర్ష్‌ షాతో కలిసి ఈ ఏడాది మార్చిలో ఆరంభించిన తమ స్టార్టప్‌ గురించి మరిన్ని వివరాలు నమ్యా మాటల్లోనే...

‘‘గుజరాత్‌లో 80 ఏళ్ల నుంచి దీప్‌కాలా అనే బ్రాండ్‌తో ఫ్యాషన్‌ రంగంలో ఉన్నారు మహర్ష్‌ షా ఫ్యామిలీ. ఈ అనుభవంతో ఇదే రంగంలో కొత్త కాన్సెప్ట్‌తో రావాలనుకున్నాం. అందుకే ఆయనతో కలిసి ఆన్‌లైన్‌ అపెరల్‌ బ్రాండ్‌ ఈనాక్షిని ప్రారంభించాం.  

21 రోజులకో కొత్త కలెక్షన్‌..: ప్రస్తుతం ఈనాక్షిలో మహిళ దుస్తులు మాత్రమే లభ్యమవుతాయి. త్వరలోనే పిల్లల గార్మెంట్స్‌లోకి విస్తరిస్తాం. ఈనాక్షిలో టాప్‌లు, లాంగ్‌ గౌన్లు, డ్రెస్‌లు, కుర్తాలు, సూట్స్‌ వంటి అన్ని రకాల మహిళల దుస్తులూ ఉంటాయి. ప్రస్తుతం ముగ్గురు డిజైనర్లున్నారు. వీరే దుస్తులను డిజైన్‌ చేస్తారు. ప్రతి 21 రోజులకు ఒక కొత్త కలెక్షన్‌తో గార్మెంట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాం. ధరలు రూ.1,500 నుంచి రూ.6,000 వరకున్నాయి. ఆర్డర్‌ వచ్చిన 24 గంటల్లోగా డెలివరీ చేస్తాం.

హైదరాబాద్‌ వాటా 10 శాతం..
అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాల్లో సేవలందిస్తున్నాం. ఈనాక్షి ప్రారంభించిన రెండు నెలల్లోనే 3 వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. ఇప్పటివరకు రూ.4 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. మా ఆదాయంలో హైదరాబాద్‌ వాటా 10 శాతం ఉంది. వచ్చే 6 నెలల్లో రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అహ్మదాబాద్‌లో తొలి ఆఫ్‌లైన్‌లో స్టోర్‌ను ప్రారంభిస్తాం’’.

>
మరిన్ని వార్తలు