ముందస్తు పన్ను వసూళ్లలో 17 శాతం వృద్ధి

16 Sep, 2014 00:19 IST|Sakshi

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముందస్తు పన్ను వసూళ్లకు సంబంధించి సెప్టెంబర్ త్రైమాసికంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు దాదాపు చేరువగా ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారి వెల్లడించింది. సుమారు 17 శాతం వృద్ధి నిర్దేశించుకోగా, వసూళ్లు లక్ష్యానికి దగ్గరగా ఉన్నట్లు వివరించారు. అయితే, ఎంత వసూలైనదీ వెల్లడించలేదు. సాధారణంగా ట్రెండ్స్ తెలియజేసేలా ప్రతిసారీ టాప్ 100 కంపెనీల చెల్లింపుల వివరాలను ప్రకటించే ఆదాయ పన్ను శాఖ అధికారులు.. గత రెండు త్రైమాసికాల తరహాలోనే ఈసారి కూడా వెల్లడించలేదు.

 దేశం మొత్తంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ముంబై సర్కిల్‌దే సింహభాగం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 7.36 లక్షల కోట్లు ఆదాయ పన్ను శాఖ నిర్దేశించుకోగా.. ఇందులో రూ. 2.3 లక్షల కోట్లు ముంబై సర్కిల్ నుంచి రాబట్టాలని భావిస్తోంది. మరోవైపు, యస్ బ్యాంక్ తాము రెండో త్రైమాసికంలో రూ. 238 కోట్లు (20 శాతం వృద్ధి) అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు పేర్కొంది. అటు హెచ్‌డీఎఫ్‌సీ 13 శాతం అధికంగా రూ. 735 కోట్లు చెల్లించినట్లు వివరించింది.

>
మరిన్ని వార్తలు