రెండో రోజూ నష్టాలే..

22 Oct, 2015 00:43 IST|Sakshi
రెండో రోజూ నష్టాలే..

* కొనసాగుతున్న లోహ షేర్లకు లాభాలు
* 254 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్
* చివరకు స్వల్ప నష్టాలతో ముగింపు
అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో మన స్టాక్ మార్కెట్ బుధవారం స్వల్పనష్టాల్లో ముగిసింది. చైనా షాంగై స్టాక్ ఎక్స్ఛేంజ్ 3 శాతం వరకూ పతనమవడంతో మన మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది.  బీఎస్‌ఈ సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయి 27,288 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 8,252 పాయింట్ల వద్ద ముగిశాయి.  

కీలకమైన బ్లూ చిప్ కంపెనీలు మంచి ఆర్థిక ఫలితాలు వెల్లడించడంతో నష్టాలు పరిమితమయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం కూడా ప్రభావం చూపింది. బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా షేర్లు నష్టపోగా, లోహ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. హీరో మోటొకార్ప్ కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో కొనుగోళ్లు జోరందుకున్నాయి.

దీంతో సెన్సెక్స్ 27,445 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో  27,191 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది.  సెన్సెక్స్ మొత్తం మీద 254 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. గత వారం వెల్లడైన   లార్జ్ క్యాప్ షేర్ల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయని వెరాసిటి గ్రూప్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ చెప్పారు. దీంతో సెంటిమెంట్ దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
 
నేడు మార్కెట్లకు సెలవు
దసరా పండుగ సందర్భంగా నేడు (గురువారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఫారెక్స్, మనీ, బులియన్, ఇతర కమోడిటీ మార్కెట్లు పనిచేయవు.

మరిన్ని వార్తలు