నాలుగో రోజూ నష్టాలే
308 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్
108 మైనస్.. 25,530 వద్ద ముగింపు
16 పాయింట్లు నష్టపోయి 7,765కు నిఫ్టీ
అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు జోరుగా ఉన్నప్పటికీ మన స్టాక్ మార్కెట్ మాత్రం సోమవారం నష్టాల్లో ముగిసింది. పొగాకు ఉత్పత్తులపై అధిక పన్ను రేటు విధించాలని జీఎస్టీ ప్యానెల్ ప్రతిపాదించడంతో ఐటీసీ 6.5 శాతం క్షీణించింది. స్టాక్ సూచీల్లో చెప్పుకోదగ్గ వెయిటేజీ ఉన్న ఐటీసీ ఈ స్థాయిలో పడిపోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 108 పాయింట్లు క్షీణించి 25,530 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 7,765 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఆయిల్, వాహన, కొన్ని ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోగా, ప్రైవేట్ బ్యాంక్, ఆర్థిక రంగ సేవల షేర్లు పెరిగాయి. స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలపాలయ్యింది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండటంతో గత బుధవారం నుంచి సెన్సెక్స్ ఇప్పటిదాకా 639 పాయింట్లు నష్టపోయింది. కాగా పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై సిన్/డీమెరిట్ ట్యాక్స్ విధించాలని జీఎస్టీ పానెల్ సిఫారసు చేయడం సిగరెట్ తయారీ కంపెనీలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించింది.