మార్కెట్‌ నష్టాలతో ప్రారంభం వెంటనే లాభాల్లోకి...

22 May, 2020 09:36 IST|Sakshi

స్టాక్‌ మార్కెట్‌ 3రోజుల వరుస లాభాల ప్రారంభానికి శుక్రవారం బ్రేక్‌ పడింది. బలహీనమై అంతర్జాతీయ సంకేతాలతో పాటు నేటి ఉదయం ఆర్‌బీఐ గవర్నర్‌ మీడియా సమావేశం నేపథ్యంలో ట్రేడర్ల అప్రమత్తత మార్కెట్‌ నష్టాల ప్రారంభానికి కారణమైంది. సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 30778 వద్ద మొదలైంది. నిఫ్టీ 57 పాయింట్లను కోల్పోయి 9049 వద్ద ప్రారంభమైంది. అలెంబిక్‌ ఫార్మా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యూపీఎల్‌తో పాటు 25 కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. హాంకాంగ్‌పై చైనా కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని విధించబోతున్నట్లు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి చైనా-అమెరికాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. దీంతో గురువారం రాత్రి అమెరికా సూచీలు అరశాతం నుంచి 1శాతం నష్టాన్ని చవిచూశాయి. నేడు ఆసియా మార్కెట్లోనూ బలహీన సంకేతాలు నెలకొన్నాయి. 

ఉదయం గం 9:30ని.లకు సెన్సెక్స్‌ 40 పాయింట్ల నష్టంతో 30895 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 9090.15 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ, మీడియా, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, రియల్టీ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతానికి పైగా నష్టపోయి 17,633 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

గెయిల్‌, ఇన్ఫ్రాటెల్‌, శ్రీసిమెంట్‌, టాటా స్టీల్‌, హిందాల్కో షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. హీరోమోటోకార్ప్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 1శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు